న్యూఢిల్లీ: కోవిడ్-19 మహమ్మారి భారత్లో ఇప్పటికే లక్షల మందిని బలి తీసుకున్నది. మరణాల సంఖ్య నాలుగు లక్షల మందికి చేరువలో ఉంది.. ప్రతి రోజూ వేలల్లో మ్రుతులు నమోదవు తున్నాయి. ఆదాయాన్ని సంపాదించి కుటుంబాన్ని పోషించే యజమానుల దుర్మరణంతో ఆయా కుటుంబాలు అల్లాడిపోతున్నాయి.
పిల్లల్లో మరణాలు తక్కువగా ఉన్నా.. మహమ్మారి వారి జీవితాలను ఛిద్రం చేసేస్తున్నది. వేల మంది పిల్లలు తమ తల్లిదండ్రుల్లో ఒకరిని గానీ, ఇద్దరినీ గానీ కోల్పోతున్నారు.
ఈ నెల ఒకటో తేదీన నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్సీపీసీఆర్).. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం కరోనాతో 9,346 మంది చిన్నారులు తమ తల్లిదండ్రుల్లో ఒకరినో, ఇద్దరినో కోల్పోయారు.
ఈ నివేదిక ప్రకారం 1,742 మంది చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయి అనాధలైనట్లు తెలుస్తున్నా.. వాస్తవంగా పేరెంట్స్ను కోల్పోయిన వారి సంఖ్య ఎక్కువగానే ఉండొచ్చునని అంచనా.
తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన, ఇద్దరిని కోల్పోయిన పిల్లలకు అండగా నిలిచేందుకు బీమా సంస్థలు ముందుకు వచ్చాయి. డిపెండెంట్ పిల్లలకు హెల్త్ కవర్ కొనసాగిస్తున్నాయి. తల్లిదండ్రులను కోల్పోయినా వారికి బీమా కవరేజీ కొనసాగుతుంది.
ఆ పిల్లలకు 21 ఏండ్ల వయస్సు వచ్చే వరకు బీమా కవరేజీ లభిస్తుంది. లీగల్ గార్డియన్లు చనిపోవడంతో అనాధలైన పిల్లల ఆరోగ్య భారం వారి బంధువులపై పడకుండా ఆరోగ్య బీమా కవరేజీని కల్పిస్తున్నాయి బీమా సంస్థలు.
కరోనాతో చనిపోయిన పిల్లలకు లీగల్ గార్డియన్గా బీమా కవరేజీ కొనసాగుతుందని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ టీఏ రామలింగం తెలిపారు. అవివాహిత పిల్లలు, సవతి పిల్లలు, దత్తత తీసుకున్న పిల్లలకు ఈ బీమా కవరేజీ లభిస్తుంది.
తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఆరోగ్య బీమా కవరేజీ కొనసాగించడానికి.. అవసరమైన అర్హతలపై ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) ఖచ్చితమైన మార్గదర్శకాలను జారీ చేసింది.