హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: ఇంజినీరింగ్ కామన్ ఎం ట్రెన్ టెస్ట్ (ఈసెట్)లో సర్కారు కాలేజీ విద్యార్థులు టాపర్లుగా నిలిచారు. పలు విభాగాల్లో ప్రథమస్థానం సాధించారు. జేఎన్టీయూలోని యూజీసీ ఆడిటోరియంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి బుధవారం ఈసెట్ ఫలితాలను విడుదలచేశారు. 95.16 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. 23,667 మంది పరీక్షలకు హాజరుకాగా.. 22,522 మంది విద్యార్థులు అర్హత సాధించినట్టు చెప్పారు. 11 విభాగాలకు చెందిన విద్యార్థుల ఫలితాలతోపాటు విభాగాలవారీగా టాపర్లను ప్రకటించారు. హైదరాబాద్లోని మాసబ్ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థి.. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం చామనపల్లికి చెందిన సాయికుమార్ సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో (160 మార్కులతో) టాపర్గా నిలిచారు. నిజామాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు.. మాక్లూర్ మండలం వెంకటాపూర్కు చెందిన దాదన్నగారి అనురాగ్రావు ఈఈఈ విభాగంలో (142 మార్కులతో), జక్రాన్పల్లి మండలానికి చెందిన బీ అభిజ్ఞ ఈసీఈ విభాగంలో (153 మార్కులతో) రాష్ట్రస్థాయి మొ దటి ర్యాంకులు పొందారు. సుల్తానాబాద్ మండలం చిన్నబొంకూర్ పరిధి రెబ్బల్దేవ్పల్లికి చెందిన మైదం సాయివర్ధన్ సివిల్ విభాగంలో (148 మార్కులతో) రెండోర్యాంకు సా ధించాడు. సాయివర్ధన్ మాసబ్ ట్యాంక్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో చదవగా.. ఆ యన తండ్రి శ్రీనివాస్ లారీ డ్రైవర్. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరకు చెందిన మాడిశెట్టి శివప్రసాద్ కెమికల్ ఇంజినీరింగ్లో (113 మార్కులతో) 3వ ర్యాంకు సాధించా డు. హైదరాబాద్లోని రామంతాపూర్ పాలిటెక్నిక్ కళాశాలలో చదివాడు. శివప్రసాద్ తండ్రి అరుణ్ దర్జి. ఈ నెల 24వ తేదీ నుంచి 28 వరకు ఈసెట్ స్లాట్బుకింగ్కు అధికారులు అ వకాశం కల్పించారు. సెప్టెంబర్ 2న సీట్లు కేటాయించనున్నారు. పాలిటెక్నిక్ పూర్తిచేసిన వి ద్యార్థులకు నేరుగా ఇంజినీరింగ్ సెకండియర్లో ప్రవేశాలు కల్పించేందుకు ఈ నెల 3న తెలంగాణ, ఏపీలో ఈసెట్ నిర్వహించారు.
ఆ సీట్లు ఈసెట్ ద్వారా భర్తీ
గతేడాది ఎంసెట్ ఇంజినీరింగ్ ఫస్టియర్లో మిలిగిన సీట్లను పాలిటెక్నిక్ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులతో ఈ ఏడాది సెకండియర్లో భర్తీచేయనున్నారు. ఈసెట్ ద్వారా అన్ని కాలేజీల్లో సెకండియర్లో ఏటా 10 శాతం సీట్లు భర్తీచేస్తారు. విద్యార్థులు చేరకపోవడంతో చాలా కాలేజీల్లో ఫస్టియర్లో సీట్లు మిగిలాయి. ఆ సీట్లను సెకండియర్లో భర్తీచేసుకోవడానికి ఉన్నత విద్యామండలి అధికారులు అవకాశమిచ్చారు.
25న ఎంసెట్ ఫలితాలు
టీఎస్ ఎంసెట్ ఇంజినీరింగ్ ఫలితాలను ఈ నెల 25న ప్రకటిస్తామని తుమ్మల పాపిరెడ్డి చెప్పారు. అన్ని వృత్తి విద్యాకోర్సుల సీట్ల సంఖ్యను 10 శాతం పెంచనున్నట్టు తెలిపారు. ఈడబ్ల్యూఎస్ కోటా అమలుతో ఇప్పుడున్న సీట్లకు పదిశాతం అదనంగా సూపర్న్యూమరీ సీట్లను మంజూరుచేయనున్నట్టు పేర్కొన్నారు. కొత్తగా మంజూరుచేసిన సిరిసిల్ల ఇంజినీరింగ్ కాలేజీ, సుల్తాన్పూర్ జేఎన్టీయూ క్యాంపస్లోని ఫార్మసీ కాలేజీలో సీట్లను సైతం భర్తీ చేయనున్నట్టు జేఎన్టీయూ వీసీ కట్టా నర్సింహారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో జేఎన్టీయూ రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్, రెక్టార్ ప్రొఫెసర్ గోవర్ధన్ పాల్గొన్నారు.