హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): ఐదేండ్లలోపు పిల్లల ఆరోగ్యం, ఎదుగుదలను నిత్యం పర్యవేక్షిస్తూ.. ఆ మేరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. రాష్ట్రంలో ఉన్న 0-5 ఏండ్ల వయస్సున్న పిల్లల ఆరోగ్య పరిరక్షణ కోసం స్త్రీ,శిశు సంక్షేమశాఖ అన్నిచర్యలు తీసుకుంటున్నది. పిల్లల ఎత్తు, బరువును ప్రామాణికంగా తీసుకొని వారి ఆరోగ్యస్థాయిని నిర్ధారించేందుకు ప్రతి ఒక్కరికి గ్రోత్మానిటరింగ్ కార్డుల జారీకి రంగం సిద్ధంచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 149 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 35,700 అంగన్వాడీ కేంద్రాల్లోఉన్న 20,20,330 మంది పిల్లలకు ఎదుగుదల కార్డులు ఇస్తున్నారు. పిల్లల ఆరోగ్య స్థితిగతులను శాస్త్రీయంగా పరీక్షించి, అనువైన పోషకపదార్థాలను సరఫరా చేయనున్నది. ఇప్పటికే నెలరోజులపాటు అన్ని అంగన్వాడీకేంద్రాల్లో 0-5 ఏండ్ల మధ్య పిల్లల వయస్సు, ఎత్తు, బరువుతోపాటు వారి ప్రాథమిక ఆరోగ్యస్థితిగతులను పరీక్షించింది.
ప్రతి ఒక్కరి ఆరోగ్యస్థితిగతుల పర్యవేక్షణ
రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీకేంద్రాల్లో ప్రతినెలా 1వ తేదీన పిల్లల బరువు, ఎత్తు, జబ్బచుట్టు కొలతను పరీక్షించి.. వయస్సుకు తగినట్టుగా ఉన్నదీ, లేనిది కార్డులో నమోదుచేస్తారు. ఇలా రికార్డు చేసే సమయంలో ఎంపిక చేసిన రంగులను వినియోగిస్తారు. ఆకుపచ్చ రంగు సాధారణ స్థాయిని, పసుపు రంగు తక్కువ పోషక లోపాన్ని, ఎరుపు రంగు తీవ్ర పోషకలోపాన్ని సూచిస్తాయి. అతితక్కువ బరువు, అతి తీవ్ర పోషక లోపం (ఎస్ఏఎం), తక్కువ తీవ్ర పోషక (ఎంఏఎం), అతి తక్కువ ఎత్తు లేదా బరువు పొడవు గుర్తించిన పిల్లలు మెడికల్ ఆఫీసర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదా వైద్యులచే పరీక్షించి.. ఫలితాల ఆధారంగా అవసరమైన చర్యలు తీసుకొనేందుకు ఈ కార్డు ఉపయుక్తంగా ఉంటుంది. పిల్లలకు షెడ్యూల్ ప్రకారం వ్యాధి నిరోధక టీకాలు, నులి పురుగుల మాత్రలు, ఐరన్, ఫోలిక్, విటమిన్-ఏ, యాంటిబయోటిక్ మందులు ఇచ్చేందుకు వీలుగా చర్యలు తీసుకుంటారు. గ్రోత్ మానిటరింగ్ కార్డుల్లో పిల్లల పూర్తి వివరాలతోపాటు ఐదేండ్లపాటు పిల్లల ఫొటోలు పెట్టేలా రూపొందించారు. పిల్లల ఎదుగుదల రికార్డు ఒకవైపు, మరోవైపు ఫొటోల్లో మార్పులను బట్టి తెలిసే విధంగా ఏర్పాటుచేశారు.