హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): కరోనా థర్డ్వేవ్ రావొచ్చన్న అంచనాల నేపథ్యంలో వైద్యసౌకర్యాలను మెరుగుపర్చుకొనేందుకు, మరిన్ని మౌలి క సదుపాయాలను సమకూర్చుకునేందు కు వేగంగా చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ మేరకు ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ జీ శ్రీనివాసరావు మంగళవారం హైకోర్టులో అఫిడవిట్ దా ఖలు చేశారు. చిన్నపిల్లల వైద్యనిపుణుల కమిటీ సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకొని మౌలిక సదుపాయాలను, సిబ్బందిని, ఔషధాలను సమకూర్చుకొంటున్నట్టు వివరించారు. ఇందులో భాగం గా రాష్ట్రంలోని డీఎంఈ, జిల్లా, ఏరియా దవాఖానల్లో అన్నిపడకలకు ఆక్సిజన్ సరఫరా కల్పిస్తున్నామని, ఈ పనులు వేగం గా జరుగుతున్నాయని తెలిపారు. అదనంగా నిర్దేశించుకున్న లక్ష్యంలో 35% పడకలకు ఆక్సిజన్ లైన్లు ఏర్పాటు చేశామని, మిగతా పడకలకు కూడా కల్పించేందుకు కృషిచేస్తున్నామని పేర్కొన్నారు.
డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, తెలంగాణ వైద్య విధానపరిషత్ ఆధ్వర్యంలోని 130 దవాఖానల్లో మొత్తం 27,141 పడకలు ఉన్నాయి. వీటిలో 10,224 పడకలకు ఆక్సిజన్ సౌకర్యం ఉన్నది. మిగతా 16,917 పడకలకు కూడా ఆక్సిజన్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ఇప్పటికే 6 వేల పడకలకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించారు. మిగతా వాటికి ఆక్సిజన్ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇవి పూర్తయితే రాష్ట్రంలోని అన్ని జిల్లా, ఏరియా దవాఖానల్లో 100% ఆక్సిజన్ పడకలు అందుబాటులో ఉంటాయి.
థర్డ్వేవ్లో ఎక్కువగా చిన్నపిల్లలే బా ధితులవుతారనే అంచనాల నేపథ్యం లో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నీలోఫర్, 9 టీచింగ్ దవాఖానల పరిధిలో 6 వేల పడకలను వారికి కేటాయించింది. అంతేకాకుండా అన్ని టీచింగ్ దవాఖానలు, జిల్లా, ఏరియా దవాఖానల్లో ప్రత్యేక ఐసోలేషన్ వార్డులు, ఐసీయూలు, ఆక్సిజన్ పడకలను ఏర్పాటు చేసింది.