మెహిదీపట్నం, జూలై 8 : కరోనా విజృంభణతో ఏడాదిగా బోసిపోయిన బోనాలు ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. చారిత్రక నగరంలో ఆధ్యాత్మిక సంబురాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమ్మా బైలెల్లినాదే.. శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలతో బోనాలు ఉత్సవాలు ఆరంభం కానున్నాయి. గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారి బోనాల ఉత్సవాలు ఈనెల 11వ తేదీ(ఆదివారం)న ప్రా రంభం కానుండడంతో ప్ర భుత్వం తరపున ఏర్పాట్లు ముమ్మరం చేశారు. నగరంలో తొలిబోనం అందుకునేది జగదాంబిక అమ్మవారే.
ఉత్సవాలు సమీపిస్తుండడంతో ఆలయానికి రంగులు వేసే పనులు చురుగ్గా జరుగుతున్నాయి. భక్తుల క్యూలైన్ల కోసం బారీకేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. బోనం సమర్పించేందుకు, అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించే పనులు వేగంగా సాగుతున్నాయి. ఆదివారం లంగర్హౌస్ చౌరస్తా నుంచి తొట్టెల ఊరేగింపుతో గోల్కొండ కోట ఆషాఢ బోనాల మొదటి పూజ జరుగుతుంది.
గోల్కొండ కోట బోనాల తొలిపూజ ఆదివారం ఉండడంతో భక్తులకు ఇబ్బంది రాకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఆసిఫ్నగర్ ఏసీపీ శివమారుతి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ బోనాల ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా నిర్వహించడానికి శాయశక్తులా కృషి చేస్తామన్నారు. సీసీ కెమెరాల నిఘా పెట్టామని, అన్నిశాఖల సమన్వయంతో ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని ఆయన చెప్పారు.
గోల్కొండ బోనాల తొలిపూజ రోజు నిర్వహించే నజర్ బోనం కోసం గురువారం జగదాంబిక ఎల్లమ్మ ఆలయం ట్రస్టు చైర్మన్ కోయల్కార్ గోవింద్రాజ్, ఆలయ ఈవో మహేందర్కుమార్ రూ.5 వేల నగదును పటేల్ అమ్మ కుమారుడు శ్రీనివాస్కు అందజేశారు. కార్యక్రమంలో బోనాల కులవృత్తుల సంఘం చైర్మన్ సాయిబాబాచారి, శివశంకర్ పాల్గొన్నారు.