డిస్కంలకు వార్షిక ఇంటిగ్రేటెడ్ రేటింగ్స్ కేటాయింపు
హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): దేశంలోని విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కం)ల పనితీరు ఆధారంగా కేంద్ర ప్రభుత్వం 9వ వార్షిక ఇంటిగ్రేటెడ్ రేటింగ్స్ను కేటాయించింది. 2020 సంవత్సరానికి సంబంధించిన ఈ రేటింగ్స్లో తెలంగాణకు చెందిన ఎస్పీడీసీఎల్ ‘బీ’ రేటింగ్ను, ఎన్పీడీసీఎల్ ‘సీ+’ రేటింగ్ను దక్కించుకున్నాయి. డిస్కంల నిర్వహణ, నియంత్రణ, ఆర్థిక సంస్కరణలకు సంబంధించిన అంశాలను ప్రాతిపదికగా తీసుకొని కేంద్ర విద్యుత్తు శాఖ 2012 నుంచి ఈ ర్యాంకులను కేటాయిస్తున్నది. 15 జిల్లాల పరిధిలో దాదాపు 92 లక్షల మంది వినియోగదారులను కలిగి ఉన్న ఎస్పీడీసీఎల్లో గతేడాది ఏటీఅండ్సీ నష్టాలు 15.41 శాతానికి తగ్గడం, బిల్లింగ్ సామర్థ్యం 93 శాతానికి పెరగడంతోపాటు దీర్ఘకాలిక విద్యుత్తు కొనుగోలు ప్రణాళికలు బాగున్నాయని పేర్కొంటూ ‘బీ’ రేటింగ్ ఇచ్చారు. అలాగే 91 శాతం బిల్లింగ్ సామర్థ్యాన్ని కలిగివున్న ఎన్పీడీసీఎల్లో దీర్ఘకాలిక విద్యుత్తు కొనుగోలు ప్రణాళికలు పటిష్ఠంగా ఉన్నప్పటికీ మరికొన్ని ఇతర అంశాల మెరుగుదలకు వెంటనే చర్యలు చేపట్టాల్సిన అవసరమున్నదని పేర్కొంటూ ‘సీ+’ రేటింగ్ను కేటాయించారు.