శ్రమ, పెట్టుబడి తక్కువ.. ఆదాయం ఎక్కువ
ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు
చిన్నకోడూరు, జూన్ 7: నూతన పద్ధతులు అవలంబించి ఎక్కువ శ్రమ లేకుండా అధిక లాభాలు గడించే మల్బరీ, ఆయిల్పామ్ తోటల సాగుకు రైతులు ముందుకు రావాలని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్లో సోమవారం రైతులు బాల్లింగు ఉమాపతి, పిల్లి ప్రభాకర్ వ్యవసాయ క్షేత్రాల్లో జడ్పీ అధ్యక్షురాలు వేలేటి రోజాశర్మతో కలిసి మంత్రి హరీశ్రావు మల్బరీ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మల్బరీ సాగు సులభతరంగా మారిందన్నారు. మార్కెట్లోనూ మంచి డిమాండ్ ఉన్నదని, రైతులు విరివిగా మల్బరీ సాగు చేపట్టాలని సూచించారు. మల్బరీ సాగు చేస్తున్న రైతుల అనుభవం తీసుకుంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధిస్తున్నట్టు వెల్లడైందన్నారు. మల్బరీ సాగులో పట్టుసాధించి అధిక లాభాలు గడిస్తున్న రైతులను మంత్రి ప్రశంసించారు.