వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులకు రాష్ట్రప్రభుత్వం శ్రీకారం చుడుతున్నది. సాగునీటి ప్రాజెక్టులతో వ్యవసాయరంగంలో మహర్దశను తీసుకొచ్చిన తెలంగాణ సర్కార్ యాంత్రీకరణకు పెద్దపీట వేస్తున్నది. ఒక కాల్తో ఉబర్ ట్యాక్సీ మన చెంతకు చేరే విధంగానే వ్యవసాయంలో ఉబరైజేషన్ విధివిధానాలు- ఇన్వెంటరీని రూపొందిస్తున్నది. ఒక ఫోన్కాల్ చేస్తే.. పొలం వద్దకే ట్రాక్టర్, వరికోత మిషిన్ వచ్చే బృహత్తర ఆధునాతన యాంత్రీకరణ పథకానికి రూపకల్పన చేస్తున్నది. దీంతో రైతులు ఎదుర్కొంటున్న కూలీల సమస్య తీరుతుంది. వరి, ఇతర పంటల కోతలు సులువు అవుతాయి. సకాలంలో పంటలు వేయటం మొదలు కోతలు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగి నష్టాలు, కష్టాల బారినుంచి రైతులు విముక్తి అవుతారు. ఈ సామాజిక ఆవశ్యకతలోంచే ఈ ఆర్థికసంవత్సరం బడ్జెట్లో వ్యవసాయరంగ యాంత్రీకరణ కోసం 1500 కోట్లు కేటాయించటం గమనార్హం.
రాష్ట్రంలో రైతులు ఎంతోకాలంగా కూలీల సమస్యతో సతమతమవుతున్నారు. వ్యవసాయ పనుల కోసం ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే కూలీలపైనే ఆధారపడే పరిస్థితి ఉన్నది. వారంతా బీహార్, ఒడిశా లాంటి దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు కాబట్టి వారి రాకకోసం రైతులు ఎదురుచూసే దుస్థితి ఉన్నది. వ్యవసాయ పనులకు ఏడాదికి 71 లక్షల పనిగంటలు అవసరం కాగా, 16 లక్షల పనిగంటల కొరత ఉన్నది. కూలీల కొరతతో అనుకున్న సమయంలో పంటలు వేయలేక, సకాలంలో కోతలు చేపట్టలేక తీవ్రంగా నష్టపోయిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలోంచే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయరంగంతో అనుసంధానం చేయాలని రైతులు కోరుతున్నారు. దానికి సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్ పలుమార్లు కేంద్రాన్ని కోరారు. అయినా రైతుల కష్టాలు పట్టని కేంద్రం తాత్సారం చేస్తున్నది. అందువల్ల కూలీల కొరత తీరే మార్గం కనిపించడం లేదు. రాష్ట్రంలో చిన్న కమతాలు ఎక్కువ. ఈ చిన్న రైతులు ట్రాక్టర్లను ఇతర యంత్రాలను కొనుక్కోలేరు.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత గత ఆరేండ్లలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఈ యాసంగిలో అంచనాలకు మించి సాగైంది. సాధారణ సాగు ఏటా 36.43లక్షల ఎకరాలు ఉంటే, ఈసారి 68.14లక్షల ఎకరాలకు చేరుకున్నది. వరిపంటనే తీసుకుంటే 22.19లక్షల ఎకరాలు సాగయ్యేచోట ఇప్పుడు 52.78లక్షల ఎకరాలు దాటింది. కంది, వేరుశనగ లాంటి ఇతర మెట్ట పంటల సాగు కూడా గతంతో పోలిస్తే రెట్టింపయింది. ఇలాంటి పరిస్థితుల్లో కూలీల సమస్యకు యాంత్రీకరణే శాశ్వత పరిష్కారం. దుక్కులు దున్నటం, కలుపుతీయటం, వరికోతకు మిషిన్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. వ్యవసాయరంగానికి అన్ని విధాలా అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో ఉన్న ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్ రద్దుచేసి చేయూతనందిస్తున్నది. యంత్రాలు కూడా అందుబాటులోకి తెస్తే వ్యవసాయం మరింత సులువు, లాభదాయకం అవుతుంది.