హైదరాబాద్ : సింగరేణి కార్మికులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ ఏడాది సంస్థ ఆర్జించిన లాభాల్లో 29శాతం వాటా ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. గతేడాది కంటే ఒక శాతం పెంచుతూ కార్మికులకు సీఎం దసరా కానుక అందించారు. వాటాను దసరా కన్నా ముందే చెల్లించాలని సీఎండీ శ్రీధర్ను సీఎం ఆదేశించారు. మంగళవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షన సింగరేణిపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టబడి ఉందని కేసీఆర్ పునరుద్ఘాటించారు. కార్మికుల భవిష్యత్ దృష్ట్యా సింగరేణి సంస్థ కార్యకలాపాలను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. బొగ్గు తవ్వకంతో పాటు ఇసుక, ఇనుము, సున్నపు రాయి తదిత ఖనిజాల తవ్వకాల్లోకి సింగరేణి విస్తరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. బొగ్గుగని మైనింగ్, పవర్ జనరేషన్ నిర్వహణలో దేశంలోనే ఉన్నత స్థానంలో సింగరేణి సంస్థను నిలుపడంలో కార్మిక శ్రమ నైపుణ్యం ఎంతో గొప్పదన్నారు.
నింతర శ్రమ చేస్తున్న కార్మికుల సంక్షేమం, భవిష్యత్కు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్మికుల నైపుణ్యాన్ని బొగ్గుతవ్వకంలోనే కాకుండా ఇసుక సున్నపురాయి, ఐరన్ తదితర ఖనిజాల తవ్వకాల్లో వినియోగించుకోవాల్సిన సందర్భం వచ్చిందన్నారు. ఇందుకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ‘ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీల వాళ్లు మన రిటైర్డ్ సింగరేణి కార్మికులను వినియోగించుకుని బొగ్గు తదితర ఖనిజాలను నిర్వహిస్తూ.. లాభాలు గడిస్తున్నారు.
మనమే ఎందుకు ఆ పని చేయకూడదు? లాభాలు వచ్చే అవకాశమున్న ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ప్రయివేట్ పరం చేస్తుండడం శోచనీయం. తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికుల సంక్షేమాన్ని, సంస్థ మనుగడను దృష్టిలో ఉంచుకుని పనిచేస్తుంది. వారి నైపుణ్యాన్ని, శక్తిని తెలంగాణ ప్రభుత్వం తప్పకుండా వినియోగించుకుంటుంది. బొగ్గుతోపాటు రాష్ట్రంలో నిల్వలున్న ఇతర మైనింగ్ రంగాలను నిర్వహిస్తూ కార్మికులకు పని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా చర్యలు చేపడుతుంది’ అని సీఎం స్పష్టం చేశారు.
సంస్థలో పనిచేసి రిటైరయిన కార్మికులు, ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా అందుతున్న పింఛను రూ.2వేల లోపే ఉందని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం చేసేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన విజ్జప్తి పట్ల సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం ద్వారా సింగరేణి రిటైర్డ్ కార్మికులు ఉద్యోగులకు సాయం చేయగలమో.. నివేదికను తయారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వర్ రావు, దివాకర్ రావు, గండ్ర వెంకటరమణారెడ్డి, హరిప్రియ నాయక్, దుర్గం చిన్నయ్య, ఆత్రం సక్కు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు బి.వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, సంఘం నాయకులు కెంగర్ల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.