న్యూఢిల్లీ : కొవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ డేటా వివరాలను భారత్ బయోటెక్ డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కు సమర్పించింది. ఈ క్రమంలో ఔషధ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలోని సబ్జెక్ట్ నిపుణుల కమిటీ (ఎస్ఈసీ) నేడు సమావేశం కానున్నది. హైదరాబాద్కు చెందిన టీకా అంతర్జాతీయ అత్యవసర వినియోగ జాబితా (ఈయూఎల్) కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థతో బుధవారం ‘ప్రీ-సబ్మిషన్’ సమావేశం సైతం జరుగనుంది. అత్యవసర వినియోగ జాబితా కోసం ట్రయల్ డేటాలో భద్రత, సమర్థత, నాణ్యత, రిస్క్ మేనేజ్మెంట్ ప్లాన్ను పరిశీలిస్తుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం పొందితే భారత్ బయోటెక్ టీకాలను ఎగుమతి చేయడంతో పాటు కొవాగ్జిన్ టీకా తీసుకున్న భారతీయ పౌరులు అంతర్జాతీయ ప్రయాణాన్ని సైతం సులభతరం చేస్తుంది. మార్చిలో భారత్ బయోటెక్ మూడో దశ ట్రయల్స్ తొలి మధ్యంతర ఫలితాలను ప్రకటించింది. టీకా 81శాతం ప్రభావవంతంగా పని చేస్తుందని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం దేశంలో వినియోగిస్తున్న మూడు టీకాల్లో కొవాగ్జిన్ ఒకటి. భారత్ బయోటెక్ కొవాగ్జిన్ టీకాను ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో తయారు చేసింది.