కఠ్మాండూ: గార్డియన్ పత్రిక ఒపీనియన్ కాలమ్ కు రాసిన లేఖలో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి అత్యంత దయార్ద్రమైన రీతిలో బ్రిటన్ సాయాన్ని అభ్యర్థించారు. ప్రస్తుతం నేపాల్లో కోవిడ్ కేసులు మరణాలు పెరుగుతున్నాయని ఆయన గుర్తు చేశారు. మొదటి నుంచీ కష్టాలు, పోరాటాలకు అలవాటు పడ్డ నేపాల్ ఇప్పుడు దయనీయ స్థితిలో ఉందని పేర్కొన్నారు. బ్రిటన్, నేపాల్ వేల మైళ్ల దూరంలో ఉన్నప్పటికీ రెండింటి మధ్య చిరకాల మైత్రి ఉందని, ప్రజల మధ్య లోతైన అనుబంధాలున్నాయని గుర్తు చేశారు. హిమాలయాలు అధిరోహించేవారికి ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేసిన షేర్పాలు ప్రస్తుతం ఊపిరి ఆడక సతమతం అవుతున్నారని తెలిపారు. ప్రస్తుతం నేపాల్ దగ్గర సాధన సంపత్తి, నిధుల లేమి వల్ల నేపాల్ పరిస్థితి దారుణంగా తయారైందని అన్నారు. ఈ మహమ్మారి ధనిక, పేద తేడాలను మరోసారి ముందుకు తెచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షలు, చికిత్స, టీకాలు ప్రపంచంలోని ప్రతిఒక్కరికీ అందుబాటులోకి వచ్చేలా చూస్తేనే మహమ్మారిని అంతం చేయొచ్చని తెలిపారు. పేదదేశాల్లోని వందల కోట్ల మందికి టీకా ఎప్పుడు లభిస్తుందో తెలియదని వివరించారు. బ్రిటన్ నుంచి సాయాన్ని నేపాల్ ఆశిస్తున్నదని తెలిపారు. జీ-7 గ్రూప్ అధ్యక్ష స్థానంలో ఉన్న బ్రిటన్ తాను సాయం అందించడమే కాకుండా సంపన్న దేశాల నుంచి సాయం అందేలా చూడాలని కోరారు. ప్రస్తుత కలగాపులగపు ప్రపంచం అందరూ క్షేమంగా ఉంటేనే ముందుకు సాగగలదని గుర్తు చేశారు.