హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి న్యాయపరంగా ఎదురవుతున్న అడ్డంకులను అధిగమించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. టీఎస్పీఎస్సీతోపాటు ఇతర ప్రభుత్వ విభాగాలను పట్టిపీడిస్తున్న కోర్టు కేసులపై నల్సార్ వర్సిటీ న్యాయ విద్యార్థులతో అధ్యయనం జరిపించాలని నిశ్చయించింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన కేసులకు ఆదిలోనే చెక్ పెట్టడంతోపాటు మున్ముందు ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. దీనిలో భాగంగా నల్సార్ వర్సిటీ రిసెర్చ్ స్కాలర్లతో రెండు రకాల అధ్యయన చేయించాలని టీఎస్పీఎస్సీ అధికారులు భావిస్తున్నారు. తొలుత 1,650 కేసులను పరిష్కరించడంపై దృష్టిసారించనున్నారు. తొలి దశలో ఈ కేసులపై లోతుగా అధ్యయనం చేసి వాటి నుంచి గట్టెక్కే మార్గాలను అన్వేషించనున్నారు. రెండో దశలో భాగంగా నోటిఫికేషన్ల జారీకి ముందు శాఖాధిపతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించనున్నారు. ప్రత్యేకించి ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, రోస్టర్ విధానానికి సంబంధించిన అంశాల విషయంలో మరింత జాగ్రత్త వహించనున్నారు.
కేసుల వల్లే అంతులేని జాప్యం
ప్రస్తుతం టీఎస్పీఎస్సీని 1,650 పైచిలుకు కేసులు పట్టిపీడిస్తున్నాయి. అభ్యర్థులు చీటికి మాటికి కోర్టులను ఆశ్రయిస్తుండటం ఉద్యోగాల భర్తీలో అంతులేని జాప్యానికి దారితీస్తున్నది. ప్రభుత్వం నిబంధనల ప్రకారమే ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపడుతున్నప్పటికీ అభ్యర్థులు చిన్నచిన్న కారణాలతో కోర్టులకెక్కుతున్నారు. మెరిట్ అభ్యర్థులు లేకపోవడంతో ఇటీవల మరో నోటిఫికేషన్ ద్వారా క్యారీఫార్వర్డ్ చేసిన స్టాఫ్నర్సు పోస్టులపైనా అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. మెరిట్లేకపోయినా ఆ పోస్టుల్లో తమకు అవకాశం కల్పించాలని పిటిషన్ వేశారు. ఇలాంటి కేసులను అధిగమించడంపై టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ డాక్టర్ బీ జనార్ధన్రెడ్డి, సభ్యులు దృష్టిసారించారు. పెండింగ్లో ఉన్న కేసులపై ఇటీవలే ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ కేసులపై నల్సార్ వర్సిటీ రిసెర్చ్ స్కాలర్లతో సమగ్ర అధ్యయనం జరిపించాలని నిర్ణయించారు.