హైదరాబాద్, జూలై 17(నమస్తే తెలంగాణ): ఆయిల్పామ్ సాగుతో రైతులకు మంచి భవిష్యత్ ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. ఈ పంట సాగుచేసే రైతులకు ప్రభుత్వం తరపున సబ్సిడీలు అందించనున్నట్టు తెలిపారు. ఆయిల్పామ్ సాగులో లాభాలు, మెళకువలపై రైతులకు అవగాహన కల్పించేందుకు శనివారం టీ-శాట్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. దేశ విదేశాల్లో ఆయిల్పామ్కు భారీ డిమాండ్ ఉందని అన్నారు. అందుకే సీఎం కేసీఆర్ ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించాలని నిర్ణయించినట్టు వివరించారు. సీఎం ఆదేశాల మేరకు వచ్చే నాలుగేండ్లలో తెలంగాణలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయిల్పామ్ సాగు చేసే రైతులకు ప్రతి ఎకరాకు రూ. 36 వేల సబ్సిడీ ఇవ్వాలని సీఎం నిర్ణయించారని చెప్పారు. బ్యాంకుల సమన్వయంతో రైతులకు రుణాలు ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆసక్తి గల రైతులకు అవగాహన కల్పించే బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. వ్యవసాయ రంగం బలోపేతం ద్వారానే అత్యధిక జనాభాకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఇదే విషయాన్ని తాను ఓ సభలో ప్రస్తావిస్తే.. తన మాటలను వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.