వనపర్తి : గులాబీ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఊరూ.. వాడా.. టీఆర్ఎస్ పార్టీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. జెండా పండుగ ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా అద్వితీయంగా సాగుతున్నాయి. వనపర్తి జిల్లాకు చెందిన గొల్ల కురుమల .. గులాబీ పండుగను వెరైటీగా జరుపుకున్నారు. గొర్రె మందల మధ్యే … వారంతా టీఆర్ఎస్ జెండాలను ఎగురవేశారు.
వనపర్తి జిల్లా గోపాల పేట మండలం తాటిపర్తి గ్రామ సమీపంలో గొర్రెల మంద వద్ద జెండా ఆవిష్కరణ చేసి అనంతరం గొర్రె పిల్లలు పట్టుకొని ఆనందం వ్యక్తం చేశారు. దీంతో ప్రకృతి వనాల మధ్య.. గులాబీ జెండా గుబాళించింది. ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణం.. జెండా పండుగకు మరింత శోభ తెచ్చింది. వానలతో పచ్చగా మారిన వనపర్తిలో.. గొల్ల కురుమలు గులాబోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
జెండా పండుగ సందర్భంగా ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా భారీ ఏర్పాట్లు చేశారు. 12,769 గ్రామపంచాయితీలతో పాటు.. 3,654 మున్సిపల్ వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగరవేయనున్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం .. అన్ని గ్రామాలు, మున్సిపాల్టీల్లో పార్టీ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. అన్ని కమిటీల్లోనూ బీసీలు, ఎస్పీలు, ఎస్టీలు, మైనార్టీలకు 51 శాతం చొప్పున అవకాశం కల్పించనున్నారు. సెప్టెంబర్ 12వ తేదీ లోగా కమిటీల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని గతంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇక ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలోనూ గులాబీ జెండా ఉత్సవం జరగనున్నది. ఢిల్లీలోని వసంత్ విహార్లో పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం శంకుస్థాపన జరగనున్నది. ఆ వేడుకలో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్లారు. మధ్యాహ్నం 1.48 నిమిషాలకు భూమిపూజ ముహూర్తం నిర్వహించనున్నారు.