జగిత్యాల, జూన్ 1(నమస్తే తెలంగాణ): ప్రజల ఆశీస్సులతో సువర్ణ తెలంగాణ దిశగా రాష్ట్రం పయనిస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలోని నూకపెల్లి కేసీఆర్ నగర్లో నిర్మిస్తున్న 4,520 డబుల్ బెడ్రూం ఇండ్ల పనులను జగిత్యాల, చొప్పదండి ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్కుమార్, సుంకె రవిశంకర్తో కలిసి మంగళవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ జగిత్యాలను జిల్లాగా ఏర్పాటుచేసి ఇక్కడి ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చారన్నారు. ఇతర జిల్లాలకు దీటు గా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. తాను నిజామాబాద్ ఎంపీగా ఉన్నప్పుడే జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలో చాలామంది నిరుపేదలు సొంత ఇళ్లు లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించి, డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరుచేయాలని సీఎం కేసీఆర్ను కలిసి విన్నవించానని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఏ జిల్లాకు ఇవ్వనివిధంగా ఒకే చోట 4,520 డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేశారని చెప్పారు. రూ.200 కోట్లకుపైగా నిధులతో వేగంగా పూర్తవుతున్న ఇండ్ల నిర్మాణాలను చూస్తుంటే సంతోషం వేస్తుందన్నారు.
సీఎం కేసీఆర్ను ఈ కాలనీకి తీసుకొచ్చి చూపిస్తే చాలా సంతోషిస్తారని పేర్కొన్నారు. వచ్చే నెల 22 వరకు డబుల్ బెడ్రూం ఇండ్లు పూర్తయ్యే అవకాశాలున్నాయని ఇంజినీర్లు, ఎమ్మెల్యేలు చెబుతున్నారని చెప్పారు. ప్రజల ఆత్మగౌరవం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతగా తపిస్తుందన్నదో స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లే నిదర్శనమన్నారు. ప్రజాఆశీర్వాద సభ సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు జగిత్యాలకు మెడికల్ కాలేజీని మంజూరు చేశారని స్పష్టంచేశారు. వైద్య కళాశాలతో పాటు నర్సింగ్ కాలేజీని సైతం మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ ఎంపీగా ఉన్నప్పటి నుంచి జగిత్యాల అభివృద్ధికి కృషి చేశానని, ఇప్పుడు సైతం జగిత్యాల ప్రాంత అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.