కరీంనగర్, ఏప్రిల్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అపర భగీరథుడు కేసీఆర్ అంకురార్పణ చేసిన శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకం పురుడు పోసుకొని, కాళేశ్వరం జలాలతో సాగు భూములను ముద్దాడుతున్నది. బీళ్లుగా మారిన చెరువులను నిండుకుండల్లా మార్చడమే కాదు.. వాటిని మత్తళ్లు దుంకించి.. పూర్వ వైభవాన్ని కండ్లముందు సాక్షాత్కరింపజేస్తున్నది. 122 కిలోమీటర్ల పొడవునా కాళేశ్వరం జలాలను ఒడిసి పట్టుకున్న వరదకాలువ.. సీఎం కేసీఆర్ కలలను నిజంచేస్తున్నది. 0-122 కిలోమీటర్ల వరకు ఉన్న వరద కాలువను ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం కింద నిండుకుండలా నింపేందుకు నాలుగు రిజర్వాయర్లుగా విభజించారు. ఇందులో 0-34 కిలోమీటర్ వరకు ఒకటి, 34-78 కిలోమీటర్ వరకు రెండోది, 73-122 వరకు మూడోది, 102-122 వరకు నాలుగోది ఏర్పాటు చేశారు. నాలుగు ప్రాంతాల్లో హెడ్ రెగ్యులేటరీలు ఏర్పాటు చేయడం వల్ల వరద కాలువ 122 కిలోమీటర్ల పొడవునా కాళేశ్వరం జలాలతో సజీవ జలధారలా మారి.. కాలువే రిజర్వాయర్లా అవతరించింది.