రాష్ట్రంలో సంక్షేమ రంగంలో స్వర్ణ యుగం నడుస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అభివర్ణించారు. ఏడున్నరేండ్ల టీఆర్ఎస్ పాలనలో ప్రజా సంక్షేమ పథకాల కోసం రూ.74 వేల కోట్లు ఖర్చుచేశామని తెలిపారు. సంక్షేమ పథకాలపై శుక్రవారం అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చకు సీఎం జవాబు ఇచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వివిధ వర్గాల సంక్షేమానికి వెచ్చించిన నిధుల పూర్తి లెక్కలను సభ ముందుంచారు. కేంద్రం నుంచి రాష్ర్టానికి భారీగా నిధులు వస్తున్నాయన్న ప్రతిపక్షాల ప్రచారంపై ఆయన మండిపడ్డారు. కేంద్రమే అప్పుల్లో ఉందనీ, మనకేం ఇస్తుందని ప్రశ్నించారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లింది.. 2.24 లక్షల కోట్లు అయితే.. కేంద్రం తిరిగి ఇచ్చింది 42 వేల కోట్లు మాత్రమేనని వెల్లండిచారు. సెంటర్ సే క్యా ఆయా.. అన్న ప్రశ్నకు కుచ్ నహీ ఆయా భాయ్ అని సీఎం జవాబిచ్చారు. ప్రపంచంలో ప్రజాక్షేత్రమే అసలైన పెద్ద కోర్టు అని ఆయన అన్నారు. పని చేసే వారినే ప్రజలు కోరుకుంటారని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పరిపాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నందునే అన్ని ఎన్నికల్లో తమనే గెలిపిస్తున్నారని గుర్తుచేశారు.
ఎట్లుండె తెలంగాణ.. ఏడేండ్ల కిందట?
ఎండిన వాగులు, ఎండిన చెరువులు
ఎండిన మళ్లు, ఎండిన చేలు
ఎండిన గొంతులు, ఎండిన కండ్లు,
ఎద ఎండిన మనుషులు!
బాధ నిండిన మనసులు!
ఏడేండ్లలో ఏం జరిగింది!
ఏ మహత్తు మాయ చేసింది
చెరువులు, వాగుల నిండా నీలాల నీళ్లు
చేద బావుల నిండా చేతికందే జలాలు
ఇండ్ల ముందటి వాకిట్ల నిండా నల్లాలు
మోటరు ఆగకుండా నిండా కరెంటు
చెలకలు, పొలాల నిండా పచ్చదనం పరవళ్లు
గాదెలు, గరిశల నిండా పొర్లుతున్న వడ్లు
రహదారుల నిండా కమ్ముకున్న చెట్లు
పల్లెలు, పట్నాల నిండా అభివృద్ధి ఆనవాళ్లు!!
దేన్ని కాదనగలం?
ఏది అబద్ధమనగలం?
ఎవరనగలరు ఇవేవీ నిజం కాదని!
ఇందులో ఏ ఒక్కటైనా జరగలేదని!
కండ్ల నిండా నీళ్లు కమ్ముకున్న దుర్భర దృశ్యం నుంచి
ఇప్పుడు నేలంతా నీైళ్లె, సంబురం నీలాకాశమైంది!
అదును తప్పిన భూమంతా ఇప్పుడు పదనే, పచ్చదనమే!
విత్తులే కాదు; ఇప్పుడు ఆశలు అంకురాలవుతున్నాయి!
మొక్కలు, చెట్లే కాదు; బతుకులు చిగురిస్తున్నాయి!!
దేన్ని కాదనగలం?
ఏది అబద్ధమనగలం?
కట్టెదుట నిలిచిన సత్యాన్ని కండ్లు చూపిస్తుంటే..
నిన్నటి అనుభవాన్ని నీ మనసే పోల్చి చెప్తుంటే…
ఏడేండ్ల కిందట కకావికలమైన నేల
ఆకు ఆకూ చిగురించి, ఆశగా పరవశిస్తుంటే..
ఎవరనగలరు ఇవేవీ నిజం కాదని!
ఎవరనగలరు ఇది పనిచేసే ప్రభుత్వం కాదని!!
ఎవరనగలరు ముఖ్యమంత్రి కేసీఆర్
తెలంగాణను తెరిపిన పడేయలేదని!!
ఎవరనగలరు ఇలాంటి ప్రభుత్వం వద్దని!!
వడ్లు కొనబోమంటున్న కేంద్రం
మరి రైతులు ఏం చేయాలి?
రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి
ఈ మధ్య కేంద్రం, రాష్ట్రం ఏదైనా మంచిచేస్తే చాలా చీప్గా మాట్లాడుతున్నరు. మీ జేబులకెల్లి ఇస్తున్నరా? అంటున్నరు. ఎవరైనా జేబులకెల్లి ఇస్తరా? ప్రపంచంలో ఇదివరకు ఎవరైనా ఇచ్చిండ్రా? అమెరికాల ఇస్తరా? లండన్ల ఇస్తరా? ఎక్కడైనా ఇలా ఉంటదా? ప్రజలు కట్టే పన్నులను సమన్వయం చేసి ధర్మబద్ధంగా తిరిగి ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం తాత్కాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక అవసరాలకు ఎట్లా వాడుతున్నరు? ఇందుకు ఎలాంటి నైపుణ్యం, దృక్పథం అనుసరిస్తున్నరు? అన్నది ముఖ్యం. దాన్నే ప్రజలు హర్షిస్తరు. దాన్నే సపోర్టు చేస్తరు.
ఇది మన తెలంగాణ.. మనందరి తెలంగాణ. అందరం కలిసి దీన్ని మరింత గొప్పగా చేసుకుందాం. రాజకీయాల కోసం మాట్లాడండి.. మేం వద్దనం. మేం తప్పులు చేస్తే విమర్శించండి వద్దనం. కానీ రాజకీయాల పేరుతో మన తెలంగాణను మనమే మలినం చేయడం, మరోరకంగా చిన్నబుచ్చే ప్రయత్నం చేయడం మంచిది కాదు. రాజకీయాల కోసం రాష్ర్టాన్ని, రాష్ట్ర ప్రగతిని విమర్శించకండి. మనల్ని మనమే కించ పరుచకోవడం గొప్పవాళ్ల లక్షణం కాదు.