పల్లె ప్రగతిలో ప్రథమస్థానం
వైకుంఠధామాలు, రైతు వేదిక, వారసంత నిర్మాణాలు
కరీంనగర్ జిల్లాలోనే తొలి పల్లెగా ఖ్యాతి
గన్నేరువరం, ఏప్రిల్ 17: నిధుల్లేక, ఆదాయం రాక, పనులు సాగక, కరెంట్ బిల్లులు కట్టలేక, కనీస వసతుల్లేక కళ తప్పిన మాదాపూర్ పల్లె ప్రగతి స్ఫూర్తితో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. వాడవాడలా నున్నని దారులు, శుభ్రమైన డ్రైనేజీలతో మెరిసిపోతున్నది. జిల్లాలోనే తొలిసారిగా సకల సౌకర్యాలతో సిద్ధమైన శ్మశానవాటిక, వారసంతతో సరికొత్తగా కనిపిస్తున్నది. ఇంటింటా, రహదారుల వెంట నాటిన మొక్కలతో పచ్చదనాన్ని సంతరించుకున్నది. ఏపుగా పెరిగిన తీరొక్క మొక్కలతో పల్లె ప్రకృతివనం ఆహ్లాదాన్ని పంచుతున్నది.
మండలంలోని మాదాపూర్ ఉమ్మడి పాలనలో అన్నింటా వెనుకబడిపోయింది. సర్కారు ప్రారంభించిన పల్లె ప్రగతితో తన రూపురేఖలను మార్చుకున్నది. నెలనెలా వస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుంటూ ప్రగతి సొబగులు అద్దుకున్నది. 2019 సెప్టెంబర్లో నిర్వహించిన తొలి విడుత కార్యక్రమంలో భాగంగా అధికారుల సమక్షంలో గ్రామసభను ఏర్పాటు చేశారు. చేపట్టాల్సిన పనులపై చర్చించారు. వాడవాడకు వెళ్లి సర్వే చేసి సమస్యలను గుర్తించారు. వెనువెంటనే పరిష్కారానికి ఉపక్రమించారు.
చకచకా పనులు..
గతేడాది పల్లె ప్రగతి కింద రూ. లక్షా 79 వేల 892లు, పన్నుల ద్వారా రూ. 2లక్షల ఆదాయం వచ్చింది. ప్రస్తుతం నెలనెలా నిధులు వస్తున్నాయి. ఇందులో నుంచి రూ. 40 వేలు కరెంట్ బిల్లులకు, ట్రాక్టర్ కిస్తీకి రూ. 50 వేలు, సిబ్బంది వేతనాలకు రూ. 25, 500 వెచ్చించారు. మిగిలిన నిధులు, ఎస్ఎఫ్సీ ద్వారా వచ్చిన నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఒరిగిన స్తంభాల స్థానంలో కొత్త పోల్స్ ఏర్పాటు చేశారు. 117 ఎల్ఈడీ బల్బులు బిగించారు. ప్రధాన వీధుల్లో 8 హైమాస్ట్లైట్లు ఏర్పాటు చేశారు. గ్రామ శివారులోని 20 గుంటల స్థలంలో రూ. 12 లక్షలు వెచ్చించి వైకుంఠధామాన్ని నిర్మించారు. రూ. 12లక్షల చొప్పున వెచ్చించి వారసంత, సెగ్రిగేషన్ షెడ్డును నిర్మించి జిల్లాలోనే తొలిసారిగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. కంపోస్ట్ షెడ్ను నిర్మించి సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు.
పారిశుధ్యానికి ప్రాధాన్యం..
గ్రామంలో పారిశుధ్యానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఇంటింటికీ రెండు చొప్పున 712 చెత్త బుట్టలను పంపిణీ చేశారు. ట్రాక్టర్ ద్వారా చెత్తను సేకరించి సెగ్రిగేషన్ షెడ్డుకు తరలిస్తున్నారు. తడి,పొడి చెత్తను వేరుచేసి పొడి వ్యర్థాలతో సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు. ప్లాస్టిక్, గాజు సీసాలు, డబ్బాలను విక్రయిస్తున్నారు. ఉపాధి నిధులతో 100శాతం ఇంకుడుగుంతలు, మరుగుదొడ్లను నిర్మించారు.