స్టేషన్ ఘన్పూర్, మే 6 : కరోనా కట్టడిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని మండల ప్రత్యేకాధికారి నర్సయ్య సూచించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం నియోజకవర్గ కేంద్రంలోని ఉన్నత శ్రేణి ప్రభుత్వాసుపత్రితో పాటు ఇప్పగూడం, తాటికొండ గ్రామాల్లోని దవాఖానలను నర్సయ్యతో పాటు ఎంపీడీవో కుమారస్వామి సందర్శించారు. 45 ఏండ్లు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ వేస్తున్న తీరు.. కొవిడ్ నిర్ధారణ పరీక్షలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
కరోనాను తరిమికొడుదాం..
బచ్చన్నపేట : ప్రజలందరం కలిసి కట్టుగా కరోనా మహమ్మారిని తరిమి కొడుదామని సర్పంచ్ వీ మల్లారెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం పంచాయతీ కార్యాలయంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా రోజు రోజుకూ విజృంభిస్తున్నందున కట్టడిని మరింత పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. దుకాణాలు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే తెరచి ఉంచాలన్నారు. కూరగాయల మార్కెట్ జూన్ 1 వరకు బంద్ ఉంటుందన్నారు. ప్రజలు స్వచ్ఛంద బంద్కు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కే హరికృష్ణ, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి భీమ్రాజు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ సహకరించాలి..
మండలంలోని కట్కూర్లో దుకాణాలు ఉదయం 6 నుంచి 10 గంటల దాకా తెరిచి ఉంచాలని, ఆ తర్వాత మూసి వేయాలని సర్పంచ్ ఎం సునీతారాజుగౌడ్ ఆధ్వర్యంలో తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా కేసులు పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. నేటి నుంచి నెలాఖరు వరకు నిబంధనలు పాటించాలన్నారు.
రఘునాథపల్లి: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం 27 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 18 మందికి పాజిటివ్ వచ్చినట్లు మండల వైద్యాధికారి స్రవంతి తెలిపారు. మండలంలో రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, భౌతిక ధూరం పాటించాలని సూచించారు.
దేవరుప్పుల: దేవరుప్పుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం 84 మందికి కొవిడ్ వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి అశోక్ మాట్లాడుతూ 45 ఏండ్లు పైబడిన వారు వ్యాక్సినేషన్ కోసం ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు.
దేవరుప్పుల: మాదాపురంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో స్థానిక సర్పంచ్ గుర్రం స్రవంతి వీధుల్లో శానిటైజేషన్ చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ స్రవంతి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు.
చిలుపూరు: మండల కేంద్రంలోని పీహెచ్సీలో 91 మందికి కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు వైద్యాధివారి ఆదిలక్ష్మీనారాయణ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 45 ఏండ్లు పై బడిన వారు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచంచారు. కరోనాను కట్టడి చేయాలంటే ప్రతి ఒక్కరూ స్వీయనియంత్రణ పాటించాలని సూచించారు.
కరోనాపై జాగ్రత్తగా ఉండాలి
చిలుపూరు: కొవిడ్పై ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని స్టేషన్ ఘన్పూర్ మార్కెట్ వైస్ చైర్మన్ ఎం రమేశ్ నాయక్ సూచించారు. గురువారం మండల కేంద్రంలోని ఆయా గ్రామాల్లో సొడియం హైపొక్లోరైట్ ద్రావణాన్ని పారిశుధ్య సిబ్బందితో పిచికారీ చేయించారు. కరోనా నియంత్రణలో అందరూ భాగస్వాములవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.