19 తులాల బంగారు ఆభరణాలు, కిలోన్నర వెండి లభ్యం
జనగామ రూరల్, ఏప్రిల్ 8: జనగామ జిల్లా పెంబర్తిలో గురువారం లంకెబిందె బయటపడింది. ఇందులో 18 తులాల 7 గ్రాముల బంగారం, కిలో 720 గ్రాముల వెండి, 7 గ్రాముల పగడాలు, కిలోకుపైగా రాగిపాత్ర, ఇతర వస్తువులు లభ్యమయ్యా యి. వీటిని జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్రావు, ఏసీపీ వినోద్కుమార్, తాసిల్దార్ రవీందర్ స్వాధీ నం చేసుకొన్నారు. జాతీయ రహదారికి సమీపంలో 11 ఎకరాలకుపైగా భూమిని నెల కిందట మెట్టు నర్సింహయాదవ్, దుర్గాప్రసాద్, నాగరాజు కొనుగోలు చేశారు. భూమిని ప్లాట్లుగా మార్చేందుకు జేసీబీతో చదును చేయిస్తుండగా ఓ లంకెబిందె బయటపడింది. భూ యాజమాలు దీనిపై సర్పంచ్ ఆంజనేయులు, గ్రామ పెద్దలు, అధికారులకు సమాచారం ఇచ్చారు. స్వాధీనం చేసుకున్న వస్తువులను జిల్లా కలెక్టర్కు అప్పగిస్తామని తాసిల్దార్ తెలిపారు. పురావస్తుశాఖ అధికారులకు విషయాన్ని తెలిపామని చెప్పారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): భూమిలోపల దొరికిన ఎలాంటి నిధిపైనా ఎవరికీ హక్కులుండవు. అది వార సత్వ సంపద కింద ప్రభుతానికే చెందుతుంది. ఇందుకు సంబంధించి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా చట్టంలో పలు నిబంధనలున్నాయి. జనగామ జిల్లా పెంబర్తిలో లంకె బిందె దొరకడంతో గుప్తనిధిపై మరోసారి చర్చ మొదలైంది. భూమిలో పాతిపెట్టిన నిధి జాతి వారసత్వ సంపద అయితే.. ఆ సొమ్ముపై ఎవరికీ ఎలాంటి హక్కులు ఉండవు. దాన్ని పూర్తిగా ప్రభుత్వం స్వాధీనం చేసుకొంటుంది.
ఇండియన్ ట్రెజర్ ట్రోవ్ యాక్ట్
బ్రిటిషర్లు దేశంలోని ఆలయాలు, రాజులు దాచిపెట్టిన నిధులు నిక్షేపాలపై మొదటి నుంచీ ప్రత్యేక కన్ను వేసిన సంగతి తెలిసిందే. ఆ నిధి కోసం వారు 1878లో ఇండియన్ ట్రెజర్ ట్రోవ్ యాక్ట్ పేరిట చట్టంచేశారు. స్వాతంత్య్రానంతరం భారత ప్రభుత్వం దానికి కొన్ని మార్పు లు చేసింది. దానిప్రకారం ఏదైనా ఒక ప్రాం తంలో, లేదంటే భూమిలో నిధి నిక్షేపాలు లభ్యమైతే అదిఎవరికి చెందాలి? ఎంత వాటా పొం దాలి? అన్న అంశాలపై స్పష్టతనిచ్చారు. ఇప్పు డు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) అదే చట్టాన్ని అమలు చేస్తున్నది. లభ్యమైన గుప్తనిధులు చారిత్రక వారసత్వ సంపదకు చెందినవి (రాచరిక కాలానికి చెందినవి) అయి తే.. రాతి ముక్కనుంచి.. రతనాల దాకా ఏమి దొరికినా.. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా స్వాధీనం చేసుకొంటుంది.
పంపకం ఓ తతంగం
గుప్తనిధుల పంపకం ఒక పెద్దతతంగమే. నిధి దొరికిందని సమాచారం రాగానే మొదట స్థానిక రెవెన్యూ, పోలీసు అధికారులు ఆ నిధిని పంచనామా చేసి కలెక్టర్కు స్వాధీనపరుస్తారు. కలెక్టర్ అది వారసత్వ సంపదా? లేక పూర్వీకు లు దాచి ఉంచినదా? అన్నది నిర్ధారిస్తారు. పూర్వీకులదైతే.. దాని వారసులెవరన్నదానిపై విచారించి సంపదను వాటాలుగా విభజించి పంచుతారు. లభించిన సొమ్ములో 1/5 వంతు భూ యజమానికి అప్పగిస్తారు. ఆ భూమిని యజమాని కాకుండా వేరొకరు సాగుచేస్తుంటే సదరు కౌలుదారులు, నిధిని వెలికితీసిన కూలీలకు 1/5 వంతులోనే కొంత వాటా దక్కుతుంది. గుప్తనిధి లభించిన సమాచారాన్ని ప్రభుత్వానికి ఇవ్వకుండా కాజేయాలని చూస్తే సదరు వ్యక్తికి జైలు శిక్ష, జరిమానా, కొన్ని సందర్భాల్లో రెండూ విధిస్తారు.