ఒకే నెలలో రెండోసారి మూడో ప్రమాద హెచ్చరిక జారీ
రాత్రికి 66 అడుగులు చేరుకునే అవకాశం
భద్రాచలం : భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా వరద పోటెత్తుతున్నది. బుధవారం రాత్రి 54.30 అడుగుల వద్ద గోదావరి ప్రవాహిస్తోంది. ఈ నేపథ్యంలో రెండోసారి మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బుధవారం రాత్రికి 63 అడుగుల నుంచి 66 అడుగుల వరకు ప్రవాహం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.
అయితే గతంలో భద్రాచలం వద్ద గోదావరి 60 అడుగులకు పైగా ప్రవహించిన సందర్భాలు ఉన్నాయి. 66 అడుగులు దాటి ప్రవహించిన సందర్భాలు కేవలం మూడు సార్లు మాత్రమే. ఇప్పటి వరకు 60 అడుగుల పైన గోదావరి వరద కొనసాగింది ఏడు సార్లు మాత్రమే.
తొలిసారిగా 1976 జూన్ 22న 63.9 అడుగుల వద్ద గోదావరి ప్రవహించి రికార్డు క్రియేట్ చేసింది. 1983, ఆగస్టు 14న 63.5 అడుగుల వద్ద గోదావరి ఉధృతి కొనసాగింది. ఈ రెండు రికార్డులు 1986లో కనుమరుగయ్యాయి. అదే ఏడాది ఆగస్టు 16న 75.6 అడుగుల వద్ద గోదావరి ప్రవహించి చరిత్ర సృష్టించింది. 1990, ఆగస్టు 24న 70.8 అడుగుల వద్ద, 2006, ఆగస్టు 6న 66.9 అడుగులు, 2013, ఆగస్టు 3న 61.6 అడుగులు, 2020, ఆగస్టు 17న 61.6 అడుగుల వద్ద గోదావరి ప్రవహించింది.
1976 నుంచి ఇప్పటివరకు 18 పార్లు మూడో ప్రమాద హెచ్చరిక జారీ అయింది. తాజాగా ఈనెల 14న (గురువారం) ఎనిమిదో సారి గోదావరి ప్రవాహం 60 అడుగులు దాటే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఒక్క జూలై నెలలోనే రెండుసార్లు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయడం ఇదే ప్రప్రథమమంటున్నాయి.
— Telangana Weatherman (@balaji25_t) July 13, 2022