హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): అన్ని వర్గాలు, ప్రాంతాల అభివృద్ధితోపాటు ఆర్థిక ప్రగతిని సాధించేలా రాష్ట్ర బడ్జెట్ను రూపొందించినట్టు కనపడుతున్నది. మౌలికవసతుల కల్పన ద్వారా ఆర్థిక కార్యకలాపాలకు ఊతమివ్వడం, ఉపాధి అవకాశాలు కల్పించడం, ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి బడ్జెట్లో పెద్దపీట వేశారు. గతంకంటే కొంత భిన్నంగా, కొత్త అంశాలపై ఈ బడ్జెట్లో దృష్టి సారించారు. గతంలో గ్రామీణ ప్రాంతాల్లోనే బడ్జెట్ కేటాయింపులు ఎక్కువగా జరగ్గా.. ఈసారి పట్టణ ప్రాంతాల్లో కూడా ఆర్థిక కార్యకలాపాలను పెంచేలా, ఉపాధికి ఊతమిచ్చేలా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చారు. గతంలో ప్రాధాన్యమిచ్చిన రంగాలకు సముచితమైన కేటాయింపులు చేస్తూనే మరికొన్ని రంగాలకు కూడా ఈసారి ప్రాధాన్యమిచ్చారు. దీని ద్వారా ఆర్థిక ప్రగతి అనే జోడెడ్ల బండి సవ్యంగా, సమాంతరంగా ముందుకు సాగేలా ప్రణాళికలు వేశారు. అభివృద్ధి యజ్ఞంలో సమాజంలో అట్టడుగున ఉన్న ఆఖరు వ్యక్తికి కూడా ప్రగతి ఫలాలు అందే లక్ష్యంతో బడ్జెట్లో ప్రతిపాదనలు ఉన్నట్టు అర్థమవుతున్నది.