భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలం వద్ద గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరిలో వరద ఉధృతి పెరిగింది. దీంతో భద్రాచలం వద్ద 44.7 అడుగుల మేర గోదావరి ప్రవాహం కొనసాగుతోంది. ఈ క్రమంలో భద్రాచలం వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరిలో సాయంత్రం వరకు వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. గోదావరి నీటిమట్టం 48 అడుగులు దాటితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు.
గోదావరిలో వరద ఉధృతి పెరుగుతుండటంతో.. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కొత్త కాలనీ, సుభాష్ నగర్ కాలనీ వాసులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడుకు రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసర సేవల కంట్రోల్ నంబర్లు 08744 – 241950, 08743 – 232444. సహాయం కోసం 93929 19743 నంబర్కు ఫోటోలు వాట్సాప్ చేయాలని అధికారులు సూచించారు.