హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): తెలుగు అకాడమీకి సంబంధించి యూనియన్ బ్యాంకులో చేసిన రూ.43 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు మాయమయ్యాయి. దీనిపై అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. హిమాయత్నగర్లోని తెలుగు అకాడమీ ఆస్తుల పంపకాలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నది. చరాస్తులను పంచుకోవాలని కోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో స్థిర, చరాస్తులను లెక్కిస్తుండగా.. యూనియన్ బ్యాంకులో రూ.43 కోట్ల ఎఫ్డీలు ఉన్నట్టు గుర్తించారు. విత్డ్రా చేసేందుకు బ్రాంచికెళ్లగా.. వాటిని ఆగస్టులోనే తీసినట్టు బ్యాంకు అధికారులు తెలిపారు.
ఫిక్స్డ్ డిపాజిట్ల అక్రమాలపై నిగ్గుతేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటుచేసింది. ఇంటర్ విద్య కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్, ఇంటర్ విద్య అకౌంట్స్ ఆఫీసర్ రాంబాబు, కళాశాల విద్య జాయింట్ డైరెక్టర్ యాదగిరితోకూడిన కమిటీని నియమించింది. అక్టోబర్ 2లోగా విచారణ జరిపి, ప్రాథమిక నివేదికను అందజేయాలని ఆదేశించింది. మరోవైపు, నిధుల గోల్మాల్ విషయంలో హైకోర్టు సిట్టింగ్ జడ్జిచేత విచారణ జరిపించాలని తెలంగాణ తెలుగు అకాడమీ ఉద్యోగుల సంఘం కోరింది. ఇందుకు బాధ్యుడైన అకౌంట్స్ అధికారిని తక్షణమే విధుల నుంచి తొలగించాలని విజ్ఞప్తిచేసింది.