బీజింగ్: నానాటికీ వృద్ధి చెందుతున్న చైనా ఆర్థిక, మిలిటరీ వ్యవస్థను దీటుగా ఎదుర్కొనేందుకు క్వాడ్ పేరుతో నాలుగు దేశాల గ్రూప్ ఒకటి ఏర్పడిన సంగతి తెలుసు కదా. ఇందులో ఇండియాతోపాటు అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ ఉన్నాయి. ఈ నాలుగు దేశాధినేతల మధ్య తొలిసారి శుక్రవారం సమావేశం జరగబోతోంది. ఈ వర్చువల్ మీటింగ్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు అమెరికా అడ్మినిస్ట్రేషన్ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఇందులో భాగంగా చైనా వ్యాక్సిన్ దౌత్యానికి చెక్ పెట్టే ఉద్దేశంతో ఇండియాలో వ్యాక్సిన్ల తయారీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఆర్థిక సాయం ప్రకటించనున్నారని ఆ అధికారి తెలిపారు.
అమెరికా ఫార్మా సంస్థలైన నొవావ్యాక్స్, జాన్సన్ & జాన్సన్లకు ఇండియాలో వ్యాక్సిన్లను తయారు చేసే సంస్థలే లక్ష్యంగా ఈ ఆర్థిక సాయం ప్రకటించనున్నట్లు ఆ అధికారి చెప్పారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగం చేసి, కొన్ని కరోనా మ్యుటేషన్లను అంతం చేయడం కోసమే క్వాడ్ దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇండియాలో అదనపు వ్యాక్సిన్ ఉత్పత్తి వల్ల ఆగ్నేయ ఆసియా దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసే అవకాశాలు మెరుగవుతాయి. ఇప్పటికే ఇండియా కూడా క్వాడ్ దేశాలను వ్యాక్సిన్ల తయారీలో పెట్టుబడి పెట్టాల్సిందిగా కోరింది.