ముదిగంటి సుజాతారెడ్డి గారి పరిజ్ఞానదాయకమైన వ్యాసం చదవడం సంతోషం కలిగించింది. కరీంనగర్ కొండరాళ్ళపైన చెక్కి ఉన్న తెలుగు పద్యాలు వేముల వాడ చాళుక్య పాలకుడు అరికేసరి కాలానికి సంబంధించినవని చరిత్రకారుడు బి.ఎన్.శాస్త్రి రాసిన ‘చాళుక్యాస్ ఆఫ్ వేములవాడ’ పుస్తకంలో చదివాను.
వరంగల్ జిల్లాలోని ‘గూడూరు (గుముడూరు) శిలా శాసనం’ విషయమై నేను సొంతంగా పరిశోధించాను. నేను రాసిన ‘ది హిస్టరీ ఆఫ్ తెలుగు కింగ్డమ్స్ ఆఫ్ రాచకొండ అండ్ దేవరకొండ’ అనే పుస్తకంలో ఈ విషయం ప్రచురించాను.
గూడూరు శాసనం 1074 నుంచి 1127 వరకు పాలించిన కల్యాణి చాళుక్య చక్రవర్తి ‘త్రిభువనమల్ల ఆరవ విక్రమాదిత్య’ కాలానికి చెందినది.
1024లో శాసనం వేయించినది గూడూరు సామంతుడు విరియాల మల్ల సేనాని. విరియాల కుటుంబ వంశ చరిత్రను, హనుమ కొండలో క్రీ.శ.995లో ‘కాకతీయ సామ్రాజ్యం’ స్థాపించిన అంశాన్ని ఈ శాసనం వివరిస్తుంది.
విరియాల కామసాని తన సోదరుడి కుమారుడు, హనుమకొండ మొదటి కాకతీయ పాలకుడు ‘గరుడ బేతరాజు’కు రాజ్యాన్ని సాధించి పెట్టడంలో ప్రధాన పాత్ర పోషించారు కానీ, ఆమె ఏ విధంగానూ ఆ శాసన రచయిత్రి కాదు. ఆమె పదవ శతాబ్దానికి చెందిన వారు కాగా, ఈ శాసనం 12వ శతాబ్దం వరకు వేయలేదు. ఈ శాసనం రాసిన వారు సంస్కృతం, కన్నడ, తెలుగు సాహిత్యాలు బాగా తెలిసిన ప్రముఖ కవులు. కామసాని ఏ విధంగానూ కవి కాదు, రచయిత్రి కాదు. ఆమె విరియాల ఎర్ర సేనాని భార్య, కాకతి గుండ రాజు సోదరి. ఆ కాలపు చారిత్రక వ్యక్తి అనేది వాస్తవం.
ధన్యవాదాలు
– డాక్టర్ పేరాల సుధాకర్ రావు,(ఫ్లొరిడా, యూఎస్)
(2021 మార్చి 7 ‘చెలిమె’లో ముదిగంటి సుజాతారెడ్డి రాసిన ‘నన్నయకు ముందే పద్యం’ వ్యాసానికి స్పందన)