హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వేగంగా పయనించడానికి, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకునేలా తగు చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లకు సీఎస్ సోమేశ్కుమార్ సూచించారు. ప్రజల కొనుగోలు శక్తి పెరిగేందుకు వీలుగా రుణాలు, వడ్డీ రిబేట్లు ఇవ్వడంలో వేగం పెంచాలని, కొత్త పథకాలకు శ్రీకారం చుట్టి సత్వర నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. బీఆర్కే భవన్లో బ్యాంకర్లతో సీఎస్ శనివారం సమావేశం నిర్వహించారు. ఇటీవల లాన్సెట్ జర్నల్ రాష్ట్రంలో కొనసాగతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రశంసించిన తీరును బ్యాంకర్లకు తెలిపారు. ఈ నేపథ్యంలో డ్రైవ్ మోడ్లో రుణాలను అందించాలని, ముఖ్యంగా వాహన, ఎలక్ట్రానిక్, దుస్తుల కొనుగోలుకు అందించాలని సూచించారు. అంతకు ముందు రియల్టర్లు, షాపింగ్ మాల్స్, టూర్ ఆపరేటర్లు, హాస్పిటాలిటీ రంగాల ప్రతినిధులతో ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు తీసుకోవాల్సిన విషయాలపై చర్చించారు.