త్వరలోనే ఉద్యోగులందరీ వ్యాక్సినేషన్
విద్యుత్తుసౌధలో కంట్రోల్ రూములు
ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్రావు
హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): కరోనా రెండోదశ మరింత తీవ్రమవుతున్న నేపథ్యంలో.. విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల పరిధిలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్తును అందించాలని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు ఆదేశించారు. సోమవారం విద్యుత్సౌధలో ట్రాన్స్కో, జెన్కో, డిస్కంల ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. త్వరలోనే విద్యుత్తు ఉద్యోగులందరికీ వ్యాక్సిన్లు వేయించేలా విద్యుత్తుసౌధలో ఏర్పాట్లు చేయనున్నట్టు సీఎండీ చెప్పారు. ట్రాన్స్కో, జెన్కోల పరిధిలో ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడానికి విద్యుత్తుసౌధలో రెండు కంట్రోల్ రూములు, జోనల్, సర్కిళ్లస్థాయిలోనూ కంట్రోల్ రూములను ఏర్పాటుచేయాలని ఆదేశించారు. మే, జూన్ నెలల్లో వచ్చే వడగళ్లు, గాలిదుమారాలతో విద్యుత్తు సరఫరా దెబ్బతినకుండా, ఒకవేళ ఏదైనా అంతరాయం వాటిల్లితే.. వెంటనే పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని డిస్కంల సీఎండీలు రఘుమారెడ్డి, గోపాలరావును ఆదేశించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రతి విద్యుత్తు ఉత్పత్తి కేంద్రంలో సీఈ ఆధ్వర్యంలో కంట్రోల్ రూము ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని కోరారు. కనీసం 15 రోజులకు కావాల్సినంత బొగ్గు, ఆయిల్, కెమికల్స్, స్పేర్స్ అందుబాటులో ఉంచుకోవాలని, డీజీ సెట్లను కూడా ఆటో రిమోట్ పద్ధతిలో సిద్ధం చేసుకోవాలని చెప్పారు. అన్ని విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు, ప్లాంట్లతోపాటు కార్యాలయాల్లో కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆదేశించారు.