కేంద్ర మంత్రి నఖ్వీకి మంత్రి మహమూద్ అలీ వినతి
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డును బలోపేతం చేసేందుకు కేంద్రం నిధులు అందించాలని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ విజ్ఞప్తిచేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న హోం మంత్రి శుక్రవారం కేంద్ర మైనారిటీశాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్నఖ్వీతో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న మైనారిటీ సంక్షేమ పథకాలు, వక్ఫ్బోర్డు ఆస్తుల ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. మహమూద్ అలీ వినతిపై సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి.. వక్ఫ్ ఆస్తుల అభివృద్ధికి అవసరమైన నిధులను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు హోం మంత్రి మహమూద్ అలీ హజ్రత్ ఖ్వాజా నిజాముద్దీన్ ఔలియా, హజ్రత్ కుతుబుద్దీన్ భక్తియార్ కాకి, హజ్రత్ నసీరుద్దీన్ చిరాగ్ మసీదులను సందర్శించి ప్రార్థనలు చేశారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకులు షరీఫుద్దీన్, మునీర్ అహ్మద్, అబ్దుల్ బాసిత్, ఫరీదుద్దీన్, మునావర్ ఖాన్, మహమ్మద్ ఇర్ఫాన్ తదితరులు హోం మంత్రి వెంట ఉన్నారు.