జగన్ ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సీబీఐకి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే అభియోగాల కేసుల్ని కొట్టేయాలని పలువురు నిందితులు దాఖలుచేసిన పిటిషన్లపై హైకోర్టు స్పందించింది. పిటిషనర్లపై ఉన్న కేసుల వివరాలు ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. పిటిషనర్లపై ఉన్న కేసుల జాబితాను పట్టిక రూపంలో అందజేయాలని సీబీఐని ఆదేశించారు. సీబీఐ సమర్పించే జాబితా ఆధారంగా పిటిషన్లను విచారిస్తామని ప్రకటించారు. జగన్ ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నిందితులుగా ఉన్న పలువురు వేర్వేరుగా దాఖలుచేసిన డిశ్చార్జి పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. వాదనలు విన్న అనంతరం విచారణను 3 వారాలకు వాయిదా వేసింది.