హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పశు సంవర్ధక, మత్స్యశాఖల బలోపేతానికి సహకరించాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టులను ఆమోదించి కేంద్రం వాటా కింది రూ. 236.17 కోట్లు విడుదల చేయాలని రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర పశు సంవర్ధక, మత్స్య శాఖ మంత్రి పురుషోత్తం రూపాలతో తలసాని బుధవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు ప్రతిపాదనలను కేంద్ర మంత్రి ముందుంచిన మంత్రి తలసాని.. మరే రాష్ట్రంలో లేని విధంగా 75 శాతం సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం మొదటి విడతలో రూ. 3,585.33 కోట్లు, ఖర్చు చేయగా రెండో విడత కోసం రూ. 4,593.75 కోట్లను సిద్ధంగా ఉంచినట్టు తెలిపారు. రూ. 100 కోట్లతో ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేపట్టినట్లు చెప్పారు. పశు రక్షణ కోసం రూ.115.54తో 100 సంచార పశు వైద్యశాలలను ఏర్పాటు చేశామని, మరో 100 ఏర్పాటుకు కేంద్రం సహకరించాలని కోరారు. పశువుల్లో నట్టల నివారణ కోసం రూ. 48.34 కోట్లతో ప్రతిపాదనలు పంపించామని, ఇందులో కేంద్రం వాటాగా రూ. 29 కోట్లు (60శాతం) విడుదల చేయాలని కోరారు. టీకాల ఉత్పత్తి కేంద్రం బలోపేతానికి రూ. 19.84 కోట్లతో, ఆరోగ్య శిబిరాల కోసం రూ. 5.08 కోట్లతో ప్రతిపాదనలు పంపామని తెలిపారు. పశువుల బీమాకు, ఘనీకృత వీర్య ప్రయోగశాల ఏర్పాటుకు, నాటుకోళ్ల పెంపకం, దక్కన్ గొర్రెల అభివృద్ధికి రూ. 41.49 కోట్లు విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్ధకశాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, షీప్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ రాంచందర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.