అధికారుల అనుమతి అవసరం లేదు
జీఓ 91తో హర్షం వ్యక్తం చేస్తున్న సర్పంచులు
నేరేడుచర్ల, ఏప్రిల్ 9 : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీఓతో పల్లెల్లో చేపడుతున్న పనుల్లో వేగం పెరుగనున్నది. గతంలో పంచాయతీల్లో ఏ పనులు చేపట్టాలన్నా గ్రామ పంచాయతీ పాలకవర్గం తీర్మానంతోపాటు అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉండేది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీఓ 91తో అధికారుల అనుమతి లేకుండానే కేవలం పంచాయతీ పాలకవర్గం తీర్మానంతోనే పల్లెల్లో అభివృద్ధి పనులు చేసుకునే వెసులుబాటు కలిగింది.
గతంలో ఇలా : ఇంతకుముందు గ్రామపంచాయతీలకు జనరల్ ఫండ్ నిధులతోపాటు ఎస్ఎఫ్సీ(స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్), ఎఫ్సీ( ఆర్థిక సంఘం నిధులు)విడుదలయ్యేవి. వీటిని జనాభా ప్రాతిపదికన పంచాయతీలకు డీపీఓల ద్వారా ఇచ్చేవారు. వచ్చిన నిధులతో గ్రామాల్లో అత్యవసర పనులను అధికారులకు తెలిపి వారి ఆమోదంతో చేపట్టేవారు. రూ.లక్షలోపు అయితే జిల్లా పంచాయతీ అధికారి, రూ.3లక్షలు దాటితే కలెక్టర్ ఆమోదం అవసరం ఉండేది.
జీఓ 91తో ఇలా : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీఓ నంబర్ 91తో నేడు గ్రామాల్లో పంచాయతీ పాలకవర్గం తీర్మానంతో పనులు చేసుకునే వెసులుబాటు కలిగింది. ప్రస్తుతం వేసవి కాబట్టి గ్రామల్లో తాగునీటి సమస్య లేకుండా సర్పంచులు ముందస్తు చర్యలు చేపట్టే అవకాశం ఏర్పడింది. పల్లె ప్రగతి, మురుగు కాల్వలు శుభ్రం చేయడంతోపాటు గ్రామాల్లో అవసరమైన పనులను చేసుకునే వీలుంది.
పనులు వేగవంతం..
ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓతో గ్రామాల్లో చేపడుతున్న పనులు త్వరగా పూర్తికానున్నాయి. పల్లె ప్రగతిలో భాగంగా పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుంది. మౌలిక వసతుల కల్పన కోసం ఉన్నతాధికారుల ఆమోదం లేకుండా కేవలం పంచాయతీ తీర్మానంతోనే పనులు చేపట్టనున్నారు.
ఇవి కూడా చదవండి..
నా చావును కోరుకుంటున్నారు : అమిత్ షాపై దీదీ ఫైర్
కరోనాతో సీనియర్ జర్నలిస్టు కన్నుమూత