హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 2 8 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం సందర్భంగా హైదరాబాద్లో భారీ ఎత్తున కటౌట్లు, ఫ్లెక్సీలు, స్వాగతతోరణాలు ఏర్పాటుచేసిన ఆ పార్టీ నాయకులకు జీహెచ్ఎంసీ భారీ ఎత్తున జరిమానాలు విధించింది. మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సహా పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులకు చలాన్లు జారీచేసింది. అడ్వర్టయిజ్మెంట్ పాలసీకి విరుద్ధంగా వీటిని ఏర్పాటుచేశారని పేర్కొంటూ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం (ఈవీడీఎం) అధికారులు చలాన్లు జారీచేస్తున్నారు. గురువారం సాయంత్రం వరకు మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్కు రూ.5 లక్షలు, రాగం సుజాత నాగేందర్కు రూ.5 లక్షలు, టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బండి రమేశ్కు రూ.3 లక్షలు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్కు రూ.55 వేలు, మాధవరం కృష్ణారావుకు రూ.10 వేలు, మంత్రి మల్లారెడ్డికి రూ.20 వేలు, మేయర్ విజయలక్ష్మికి రూ.30 వేలు చొప్పున జరిమానాలు విధించినట్టు ఈవీడీఏం అధికారులు తెలిపారు. శుక్రవారం సాయంత్రంలోగా నేతల వారీగా చలాన్ల జాబితాను విడుదలచేస్తామని చెప్పారు. హైదరాబాద్ నగరాన్ని అందంగా ఉంచడమే లక్ష్యంగా చర్యలు తీసుకొంటున్నట్టు పేర్కొన్నారు.