స్నేహితుడి కోసం మొదలెట్టి.. 89సార్లు రక్తదానం
ఎంతోమంది ప్రాణాలు కాపాడిన చంద్రశేఖర్
ఇందూరు, మే 25:
రక్తదానం అంటేనే భయపడుతుంటారు కొందరు. ఒక్కసారి దెబ్బ తగిలి కొంచెం రక్తస్రావమైతే ఆందోళన చెందుతుంటారు. కానీ సంవత్సరానికి నాలుగుసార్లు రక్తం ఇవ్వడమంటే మామూలు విషయం కాదు. అలా ఒక్కసారి కాదు రెండు సార్లు ఏకంగా 89 సార్లు రక్తదానం చేశారంటే అతనికి ప్రాణదానం మీద ఉన్న ఆశయం గొప్పదని చెప్పాలి. అతను ఎవరో కాదు నిజామాబాద్ నగరంలోని సీతారాంనగర్కు చెందిన కోటగిరి చంద్రశేఖర్. వృత్తిరీత్యా ఎల్ఐసీలో అడ్వయిజర్గా, వివిధ స్వచ్ఛంద సంస్థల్లో సేవలందిస్తున్నారు. సంవత్సరానికి నాలుగుసార్లు రక్తదానం చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. 1983 గిరిరాజ్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ క్యాంప్కి వెళ్లిన చంద్రశేఖర్ అక్కడ మొదటిసారి రక్తదానం చేశారు. స్నేహితులతోపాటు తాను కూడా వాలంటీర్గా రక్తదానం చేశారు. ఆ క్యాంప్కు ముఖ్యఅతిథిగా వచ్చిన అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శంకర్ దయాళ్ శర్మ చేతుల మీదుగా సర్టిఫికెట్ అందుకున్నారు.
స్నేహితుని మరణం చూసి చలించి..
డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నప్పుడు తన ప్రాణస్నేహితుడు సుభాష్కు తెల పసిరికలు (జాండీస్) కావడం, రక్తం దొరక్కపోవడంతో తన స్నేహితులతో కలిసి సైకిల్పై బోధన్, నిజామాబాద్ తిరిగినా ఎక్కడ దొరకలేదు. ఎవరూ ఇవ్వడానికి ముందుకు రాలేదు. చివరికి మిత్రుడిని కోల్పోవడం జరిగింది. తన పుట్టినరోజు రక్తదానం చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు. అలా ప్రారంభించిన అలవాటు సంవత్సరానికి నాలుగుసార్లు రక్తదానం చేస్తూనే ఉన్నాడు. తాను ఇవ్వడమే కాదు తన మిత్రులతో కూడా ఇప్పిస్తాడు. ప్రతి సంవత్సరం శిబిరాలు ఏర్పాటు చేసి వాలంటీర్లు, స్నేహితులతో రక్తదానం చేయిస్తున్నారు.
రక్తం ఇవ్వండి.. ప్రాణదాతలు కండి..
సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందినప్పటికీ రక్తం తయారు చేయడం సాధ్యం కావడం లేదు. రక్తం కావాలంటే మరొక వ్యక్తి రక్తం ఇవ్వాల్సిందే. ఒక వ్యక్తి ఇచ్చిన రక్తం నుంచి ముగ్గురి ప్రాణాలు కాపాడవచ్చు. యువత స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేస్తే ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి, వారి కుటుంబానికీ మేలు చేసిన వారమవుతాం. డాక్టర్ విద్యాసాగర్ 94 సార్లు రక్తదానం చేశారు. వారిని అధిగమించి 100సార్లు రక్తదానం చేయాలన్నదే నా ఆశయం. నా భార్య లీల కుమారి 11 సార్లు, నా కొడుకులు విధిత్ కుమార్ 23సార్లు, విఖ్యాత్ కుమార్ నాలుగు సార్లు రక్తదానం చేశారు.