దండో దమయతా మస్మి నీతిరస్మి జిగీషతామ్
మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహమ్
భగవద్గీత (10.38)
దండించేవారిలోని దండనీతిని, జయించాలని కోరేవారిలోని రాజనీతిని, రహస్యంగా ఉండాలనే వాటిలోని మౌనాన్ని, జ్ఞానులలోని జ్ఞానాన్ని.. నేనే’ అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. ‘దండనీతి’, ‘రాజనీతి’ రెండూ ఒకే నాణేనికి బొమ్మాబొరుసు వంటివి. లౌక్యంతో చేసేది, చమత్కారంతో జయించేది ‘రాజనీతి’. తప్పు చేసేవారికి విధించే శిక్ష ‘దండనీతి’. ఇది సహజంగా అధికారులకు, కుటుంబ పెద్దలకు, న్యాయాధీశులకు ఉంటుంది. పరిపాలనా విధానాల్లో ముఖ్యమైంది దండనీతి. దండించే అధికారం ఒకరి సొత్తు కాదు. ప్రభుత్వ అధికారం ఎవరిదో వారికే నేరస్థులను శిక్షించే శక్తీ వస్తుంది. న్యాయస్థానాల్లో వాదనలు విని శిక్ష వేసే అధికారం న్యాయాధిపతి (జడ్జి)కి ఉంటుంది. వీరికి ‘దండనీతి’పై అవగాహన ఉండాలి.
దండనీతి శాస్ర్తాన్ని వారు ఔపోసన పట్టి ఉండాలి. తక్కువ నేరానికి ఎక్కువ శిక్ష, నేరం చేయనివారికి దండన విధించడం వంటివి చేయరాదు. ‘శిక్ష విధించేవారిలో దండనీతిని నేను’ అన్న పరమాత్మ ప్రబోధంలోని కోణాన్ని మనం అర్థం చేసుకోవాలి. ‘దండనీతి’ అంటే ‘దమననీతి’ కాదు. దండనీతిలోని శక్తియే పరమాత్మ.
రాజనీతి శాస్త్రమూ చాలా లోతైంది. మన పూర్వీకులు అసలుసిసలైన రాజనీతిని అభ్యసించి, అమలు పరిచారు. ‘జయాన్ని కోరేవారిలో ఏదైతే నీతి ఉందో అదే నేను’ అన్నాడు పరమాత్మ. ఇక్కడ ‘జయం’ అంటే వ్యక్తుల మీద ఆధిపత్యం కాదు. ఒక సభ్యసమాజంలోని వ్యక్తులలో మానసిక పరివర్తన కలిగించి వారిని సన్మార్గం వైపు మళ్లించగలగడం. అదీ నిజమైన విజయం. ఏ పాలకులైతే సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తూ, ప్రజల హృదయాలను అటువైపు మళ్లించగలుగుతారో వారిదే అసలైన జయం.
ఎప్పుడైతే లౌకిక ప్రయోజనాలే ధ్యేయమవుతాయో అలాంటి విజయం శాశ్వతం కాదు. ఏ విజయమైతే మానవునిలో నైతిక ఉత్థానం తీసుకొని రాగలుగుతుందో అదే నిజమైన, శాశ్వతమైన విజయం. ఏ విజయం వల్ల మానవుడు ఆధ్యాత్మికంగా బలపడగలుగుతాడో అదీ అసలు విజయం. ఆ విజేతల్లోని చైతన్యశక్తియే పరమాత్మ.
‘మౌనం’ అనేది ఓ విద్య. ఇది ఎన్నో సమస్యలకు పరిష్కారం. ‘గుహ్యానాం మౌనం’. ఏ విషయమైనా రహస్యంగా ఉండాలంటే మౌనమే శరణ్యం. నోరు విప్పితే ఎప్పుడో ఒకప్పుడు, ఎలాగో ఒకలాగా రహస్యం బయటపడుతుంది. సాధారణంగా ఆత్మజ్ఞానాన్ని ‘గుహ్య తమమ్’ అంటారు. అంటే, ఇక్కడ ‘తెలియరానిది’ అని కాదు అర్థం. ఆత్మజ్ఞానం ఎంతో లోతైంది. ‘ఆత్మానుభవం’ అనుభవైకవేద్యమే కానీ, పుస్తకాల్లో రాసేది, ఉపన్యాసాల్లో వినేది కాదు. స్వయంగా సాధన చేసి అనుభూతి చెందాలి. ‘పంచదార తీపి, కాకరకాయ చేదు తింటేనే కదా తెలిసేది.
ఆత్మానుభవమూ అంతే!’ ఆత్మజ్ఞానమూ అలాంటిదే. ఒక్కోసారి మౌనమే పలు సందేహాలకు సమాధానాలు ఇస్తుంది. రహస్యం కాపాడబడాలంటే మౌనమే శరణ్యం. మౌనాన్ని కాపాడుకోవడం చాలా కష్టం. ‘అటువంటి మౌనమే నేను’ అన్నాడు పరమాత్మ. ‘దండనీతి, రాజనీతి, మౌనం’ అనేవి మానవుని జీవితంలో నిత్యం జరిగే ప్రక్రియలే. వీటిలో మౌనం అత్యంత ప్రాముఖ్యాన్ని కలిగి ఉంటుంది. దండనీతి రాజనీతితో ముడిపడి ఉంటుంది. మౌనం మాత్రం దేనితోనూ కలవదు. ఇది సాధన ద్వారా మాత్రమే సాధ్యం.