మొయినాబాద్ : మహిళాలు సంఘాలను ఏర్పాటు చేసుకుని బ్యాంకుల ద్వారా రుణాలు పొంది ఆర్థికంగా అభివృద్ధి చెందడం అభినందనీయమని జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ రాష్ట్ర నోడల్ అధికారి గాయత్రి అన్నారు. శనివారం ఆమె మండల మహిళా సమాఖ్య సభ్యులతో సమావేశం అయి మూడు గంటల పాటు సంఘాల పని తీరు, బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు, సంఘాల ఆదాయం, బ్యాంకుల ద్వారా పొందిన రుణాలతో ఎలాంటి ఉపాధి పొందుతున్నారని సంఘాల సభ్యులను అడిగి తెలుసుకున్నారు. మండల సమాఖ్యలో ఎలాంటి అంశాలు చర్చిస్తారని అడిగారు. ఆమె అడిగిన దానికి సంఘాల సభ్యులు స్పందిస్తూ బ్యాంకుల ద్వారా పొందిన రుణాలతో పిల్లల చదువులకు, దుఖాణాలు ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతున్నామని అన్నారు.
బ్యాంకుల్లో ఎలాంటి సమస్యలు ఉన్న బ్యాంకుకు వెళ్లి అధికారులతో చర్చించడం జరుగుతుందని తెలిపారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు రూ. 11. 75 కోట్లు రుణాలు ఇప్పించడం జరిగిందని, స్వయం ఉపాధి కోసం 175 దుఖాణాలు ఏర్పాటు చేయించడం జరిగిందని ఏపీఎం రవీందర్ చెప్పారు. ఈ సందర్భంగా గాయత్రి మాట్లాడుతూ మహిళలు సంఘాలు ఏర్పాటు చేసుకుని బ్యాంకుల ద్వారా రుణాలు పొంది అభివృద్ధి చెందడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి కల్పించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందడం అభినందనీయమన్నారు. సంఘాల సభ్యులు ఏర్పాటు చేసుకున్న దుఖాణాలను ఆమె చిలుకూరులో సందర్శించారు. వారితో పాటు ఏపీఎం సమత, డీఎంజీ రవీందర్, సీసీలు జంగయ్య, మల్లేష్, రమేశ్, మంజూల, రజియా, నాగలత, శైలజ, మహిళా సంఘం అధ్యక్షురాలు మనీల, ఉపాధ్యక్షురాలు మనీల, కార్యదర్శి లత, కోశాధికారి మంగమ్మ ఉన్నారు.