హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): నవ దంపతులు జన్యు పరీక్షలు చేయించుకోవడం వల్ల పుట్టబోయే పిల్లల్లో చాలా రకాల సమస్యలను నివారించవచ్చునని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. దేశంలోని ప్రతి 30 మందిలో ఒకరు జన్యుపరమైన సమస్యలతో బాధపడుతున్నట్టు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్), సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ (సీసీఎంబీ) సంయుక్త అధ్యయనంలో తేలింది. మేనరికం, దగ్గరి బంధువుల మధ్య వివాహాలే ఇందుకు కారణమని పేర్కొంది. చాలా కేసుల్లో జన్యులోపాలు తల్లిదండ్రుల నుంచి పిల్లలకు, ఆ తరువాతి తరాలకు సంక్రమించే అవకాశమున్నది. నరాల బలహీనత, క్యాన్సర్లు, సికిల్సెల్ అనీమియా, వెన్ను కండరాల క్షీణత తదితర వ్యాధులకు ఇది దారితీసే ప్రమాదమున్నదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దేశంలో దాదాపు 7 కోట్ల నుంచి 9.60 కోట్ల మంది జన్యుపరమైన రుగ్మతలతో బాధపడుతున్నట్టు అంచనా. ప్రతి ఐదువేల మందిలో ఒకరు లేదా ఇద్దరిని అరుదైన వ్యాధి బాధిస్తున్నది. జన్యువ్యాధులను నయం చేయలేకపోయినా ముందుగానే గుర్తించడం, రోగనిర్ధారణ ద్వారా వాటిని నియంత్రించవచ్చు. లేనిపక్షంలో కుటుంబంలోని తరతరాలను ప్రభావితం చేస్తాయని సీసీఎంబీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తరచుగా గర్భధారణ వైఫల్యాలు, శిశువుల్లో గుండె సంబంధింత సమస్యలు, పుట్టుకతో వచ్చే వైకల్యాలకు జన్యులోపాలే కారణమని చెప్తున్నారు. వీటిని పూర్తిగా నివారించే చికిత్సలు లేనప్పటికీ,దాదాపు 800 రకాల జన్యు సమస్యలను ఇంజెక్షన్లు, జన్యుమార్పిడి చికిత్సతో నివారించవచ్చని పేర్కొన్నారు. రానున్న పది, పదిహేనేండ్లలో అధునాతన చికిత్సలు అందుబాటులోకొచ్చే అవకాశం ఉన్నా ముందుజాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. హైదరాబాద్లోని సీసీఎంబీ క్యాంపస్లో ఉన్న జెనిటిక్ డయాగ్నోస్టిక్ సెంటర్లో జన్యుపరమైన సమస్యలను గుర్తించే పరీక్షలు చేయించుకోవచ్చని తెలిపారు.