ప్రధాని మోదీ ఆటలు ఇక్కడ సాగవు
టీఆర్ఎస్ నాయకుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు
నీలగిరి, జూలై 18: వృథాగా సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను కాళేశ్వరం ద్వారా ప్రతి ఎకరాకు సాగు నీరందించి వ్యవసాయాన్ని సీఎం కేసీఆర్ పండుగలా మార్చారని టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు అన్నారు. కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులతో రాష్ట్రం ధాన్యాగారంగా మారిందని తెలిపారు. ఇది ప్రధాని మోదీకి, ఏపీ సీఎం జగన్కు కంటగింపైందన్నారు. దీంతో కేంద్రం, ఏపీ ప్రభుత్వం కుట్రపూరితంగా ఏకపక్ష నిర్ణయంతో కృష్ణా నదీ జలాల పర్యవేక్షక గెజిట్ను విడుదల చేసిందని విమర్శించారు. ఆదివారం నల్లగొండలో ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, ఎన్ భాస్కర్రావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలకు భంగం కలిగించే గెజిట్ ఆమోదయోగ్యం కాదని, దీనికోసం ఎటువంటి ఉద్యమానికైనా సిద్ధమేనని స్పష్టం చేశారు.