హైదరాబాద్, జూన్ 1(నమస్తే తెలంగాణ): పోలీస్ కార్యాలయ భవనాల నిర్మాణాన్ని గడువులోగా పూర్తి చేయాలని హోం మంత్రి మహమూద్ అలీ అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంగళవారం ఆయన పోలీస్ శాఖకు చెందిన భవనాల నిర్మాణ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఇంచార్జి ఎండీ సంజయ్కుమార్ జైన్, కార్పొరేషన్ చీఫ్ ఇంజినీర్ విజయ్కుమార్, ఎస్ఈ తులసీధర్ తదితరులు ఈ సమీక్షలో భవన నిర్మాణాల పురోగతిని హోం మంత్రికి వివరించారు. సిద్దిపేట కమిషనర్ కార్యాలయం, కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయ భవనాలు ఇప్పటికే పూర్తయ్యాయన్నారు. సిరిసిల్ల, సూర్యాపేట, ఆసిఫాబాద్, నాగర్కర్నూల్, భూపాలపల్లి, వనపర్తి, మహబూబాబాద్, కొత్తగూడెం, జగిత్యాల జిల్లాల పోలీస్ కార్యాలయాలతోపాటు రామగుండం పోలీస్ కమిషనరేట్ భవనం నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్లో కాచిగూడ, మహంకాళి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల భవనాలు సిద్ధంగా ఉన్నాయని, ఎస్ఆర్ నగర్, ఆసిఫ్నగర్, చాంద్రాయణగుట్ట, కాచిగూడ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ భవనాలు త్వరలో పూర్తవుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా హోం మంత్రి మహమూద్అలీ మాట్లాడుతూ.. పోలీస్ కార్యాలయాలు, స్టేషన్ల భవనాలు అందుబాటులోకి వస్తే ప్రజలకు మరింత మెరుగ్గా భద్రత కల్పించే అవకాశం ఉంటుందన్నారు. నేర నియంత్రణకు పోలీస్ సిబ్బంది మరింత పకడ్బందీగా చర్యలు తీసుకునే వీలు కలుగుతుందని చెప్పారు.