సూర్యాపేట, జూలై 4 : పేద ప్రజలకు అందించే ఆహార భద్రత కార్డులను ప్రభుత్వం మంజూరు చేసింది. కొంతకాలంగా దరఖాస్తు చేసుకున్న వారికి నూతన ఆహార భద్రత కార్డులు మంజూరు చేయగా వాటిని ఒకటి, రెండ్రోజుల్లో అందించనున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 11,113 మందికి ఆహార భద్రత కార్డులు రానున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఆహార భద్రత కార్డులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ కార్డును సైతం ఇంటి మహిళ పేరు మీద మంజూరు చేశారు. అప్పటి వరకు అరకొరగా ఉన్న రేషన్ కార్డుల సంఖ్య భారీగా పెరిగింది. సమైక్య రాష్ట్రంలో కాల్లు అరిగేలా తరిగినా మంజూరు కాని కార్డులను సీఎం కేసీఆర్ లక్షలాది మందికి అందించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 610 రేషన్ దుకాణాల పరిధిలో 3,16,596 మందికి ఆహార భద్రత కార్డులు ఇచ్చారు. ఈ కార్డుల్లో అంత్యోదయ ఆహార భద్రత కార్డులు 19,780, అన్నపూర్ణ కార్డులు 42, ఆహార భద్రత కార్డులు 2,96,774 ఉన్నాయి. వీటి ద్వారా 9,27,477 మంది లబ్ధి పొందుతున్నారు. వీరందరికీ నెల నెలా 59,330 మెట్రిక్ టన్నుల బియ్యం, 19,780 కేజీల చక్కెర, 62,772 కిలోల గోధుమలు, 3,16,596 కేజీల ఉప్పు, 34,653 లీటర్ల కిరోసిన్ పంపిణీ చేస్తున్నారు.
11,113 మందికి కొత్త కార్డులు
గడిచిన కొన్నేళ్లుగా పెండ్లిళ్లు అయిన వారు, కుటుంబం నుంచి వేరయిన వారు కొత్త ఆహార భద్రత కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ అర్హులందరికీ కొత్త ఆహార భద్రత కార్డులు అందిస్తామని హామీ ఇవ్వడంతో పెండింగ్ దరఖాస్తులకు మోక్షం కలిగింది. దీంతో జిల్లాలో నూతనంగా 11,113 మందికి కొత్త ఆహార భద్రత కార్డులు మంజూరయ్యాయి. వీటి ద్వారా సుమారు 25వేల మందికి పైగానే ఉచితంగా బియ్యం పంపిణీ చేయనున్నారు.