250 యూనిట్ల ఉచిత విద్యుత్తుపై సమాలోచన
హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): సెలూన్లు, లాండ్రీలు, దోబీ ఘాట్లకు ఉచితంగా 250 యూనిట్ల విద్యుత్తును అందించే విధానాన్ని సరళీకరించాలని నాయీబ్రాహ్మణ, రజక సంఘాల నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు వస్తున్నాయి. దీంతో ఈ నెల 11న ఆయా సంఘాల ప్రతినిధులతో భేటీ కావాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం ఆయన బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, రజక ఫెడరేషన్ ఎండీ చంద్రశేఖర్రావు, నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్ ఎండీ విమలాదేవి తదితరులతో సమావేశం నిర్వహించారు. 11న ఖైరతాబాద్లోని కార్యాలయంలో రజక, నాయీబ్రాహ్మణ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలని మంత్రి గంగుల నిర్ణయించారు.