హుజురాబాద్: అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బుధవారం ఆయన హుజురాబాద్ సిటీ సెంట్రల్ హాల్ లో జరిగిన కులసంఘాల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం, స్వర్ణకార సంఘం, ఉప్పర సంఘం, మేరు కులస్తులు పాల్గొన్నారు. ఆయా కులాల ప్రజలు ఎదుర్కొంటున్నసమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు.
వారి సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని… వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ కులసంఘాల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. గత ప్రభుత్వాల హయాంలో కులసంఘాల అభివృద్దిని పట్టించుకోలేదని… స్వయం పాలనలో ప్రతి సంఘానికి… సంఘభవనాన్నినిర్మించి… వారి ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నామన్నారు.
ఇప్పటికే పలు కులసంఘాలకు స్థలాలను కెటాయించడంతో పాటు… భవన నిర్మాణాల కోసం నిధులను కూడా మంజూరు చేశామని ఆయన గుర్తు చేశారు. అభివృద్ది టిఆర్ఎస్ తోనే సాధ్యమని… తెలంగాణ రాష్ట్ర సమితి ని గెలిపించి… ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆశీర్వదించాలని గంగుల పిలుపునిచ్చారు. ఈటల రాజేందర్ తెలంగాణ ప్రభుత్వం లో ఆర్ధిక మంత్రిగా ఉండి అభివృద్ధి చేయనోడు… ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యే గా హుజురాబాద్ ను ఏమి అభివృద్ది చేస్తాడని ప్రశ్నించారు.
బీజేపీ హయాంలో ఇప్పటికే పెట్రోలు,డిజీల్,గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగి సామాన్యుడికి భారంగా మారాయని… మళ్ళీ గెలిపిస్తే… మరిన్ని ధరలు పెంచుతారా అంటూ నిలదీశారు. తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలని… వారి ఆనందమే తన ధ్యేయమంటూ… దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు చేపడుతున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఈటెల రాజేందర్ కేవలం తన స్వార్థం కోసమే రాజీనామా చేశాడే తప్ప… ప్రజల సంక్షేమం కోసం కాదన్నారు.
హుజురాబాద్ కు రాబోయే ఉపఎన్నికలు కీలకమైనవని, ఈటెల రాజేందర్ గెలిస్తే… తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య ఒకటి పెరిగి మూడుకు చేరుతుందే తప్ప… హుజురాబాద్ ప్రజలకు ఓరిగేది ఏమీ లేదన్నారు. అదే టిఆర్ఎస్ గెలిస్తే… ఇక్కడి ప్రజలు గెలుస్తారని… హుజురాబాద్ నియోజకవర్గం అభివృద్ది పథంలో దూసుకుపోతుందన్నారు.
ఇన్నాళ్ళు చుట్టుప్రక్కల నియోజకవర్గాలు అభివృద్దిలో దూసుకుపోతే… అభివృద్దికి ఆమడ దూరంలో నిలిచిన హుజురాబాద్ వాటికి ధీటుగా అభివృద్ది చెందుతుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. అభివృద్దిని కాంక్షించే వారు టిఆర్ ఎస్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. స్వర్ణకార, ముదిరాజ్, మేర, ఉప్పర కుల సంఘాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని… వారి సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటామని గంగుల హామీ ఇచ్చారు.