కరీంనగర్. జూలై 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): హుజూరాబాద్లో ఓటమి భయంతోనే బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ సానుభూతి కోసం కొత్త డ్రామాకు తెరలేపారని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. ఒక మంత్రి తనను హత్యచేసేందుకు కుట్రపన్నిన విషయం ఒక మాజీ నక్సలైట్ చెప్పాడంటూ ఈటల చేసిన వ్యాఖ్యలపై గంగుల తీవ్రంగా స్పందించారు. మంగళవారం ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ.. ఈటలతో రాజకీయ వైరమే తప్ప వ్యక్తిగత శత్రు త్వం లేదని చెప్పారు. హత్యా ప్రయత్నానికి సంబంధించిన సమాచారం ఈటల వద్ద ఉంటే.. పోలీసులకు ఫిర్యాదుచేయాలని కోరారు. దీనిపై కేంద్ర సంస్థలతో కూడా విచారణ జరిపించొచ్చ ని పేర్కొన్నారు. విచారణలో కుట్ర పన్నినట్టుగా తేలితే రాజకీయాల నుంచి తప్పుకొంటానని గంగుల సవాల్ విసిరిరారు. లేదా ఓట్ల కోసం, సానుభూతి కోసం కొత్త డ్రామా ఆడానని ఒప్పుకొని, ప్రజలకు భేషరతుగా క్షమాపణ చెప్పి.. ఈటల రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, కరీంనగర్ మేయర్ సునీల్రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు పాల్గొన్నారు.