హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా వినాయక నిమజ్జనం శోభాయాత్రలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. ప్రభుత్వ విభాగాలు, గణేశ్ నిమజ్జన మండళ్ల సమన్వయంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. మంత్రులు మహమూద్అలీ, తలసాని శ్రీనివాస్యాదవ్లతో కలిసి డీజీపీ మహేందర్రెడ్డి హైదరాబాద్లో జరిగిన నిమజ్జనాన్ని హెలికాప్టర్ ద్వారా ఏరియల్ వ్యూలో పరిశీలించారు. పూర్తిస్థాయిలో టెక్నాలజీ వినియోగించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా డీజీపీ మహేందర్రెడ్డి నిమజ్జన బందోబస్తు పర్యవేక్షించారు. హైదరాబాద్ నగరంలో దశాబ్దాల నుంచి అనుసరిస్తున్న సంప్రదాయం ప్రకారం బాలాపూర్ గణపతికి తెల్లవారుజామున గణేశ్ ఉత్సవ సమితి ప్రత్యేక పూజలు జరిపి సామూహిక వినాయక నిమజ్జన యాత్రను ప్రారంభించారు. బాలాపూర్ నుంచి ట్యాంక్బండ్ వైపు పది అడుగులకుపైగా ఉన్న భారీ విగ్రహాలు మధ్యాహ్నం నుంచి సాగర్ వైపునకు తరలివచ్చాయి. ఖైరతాబాద్ పంచముఖ రుద్ర మహాగణపతిని ఉదయం 8.15 గంటలకు లారీపైకి ఎక్కించారు. బోనాలు, ఒగ్గుడోలు, కోలాటాలతో కోలాహలంగా ప్రారంభమైన శోభాయాత్ర మధ్యాహ్నం 3.23 గంటలకు హుస్సేన్సాగర్లో మహా నిమజ్జనంతో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ నిమజ్జనం విజయవంతంగా పూర్తవడంపై డీజీపీ మహేందర్రెడ్డి ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడా రు. కొద్దిరోజులుగా ఎంతో శ్రమించి, టీం వర్క్ తో గణేశ్ నిమజ్జనాలు రాష్ట్రమంతటా ప్రశాంతంగా పూర్తిచేసిన సిబ్బందిని అభినందిస్తున్నట్టు తెలిపారు. లక్ష సీసీటీవీ కెమెరాలను అన్ని రూట్ల లో అనుసంధానం చేసినట్టు పేర్కొన్నారు.