హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ వైద్యారోగ్యానికి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చి ఈ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఎంతో కృషి చేశారని ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నారాయణపేట జిల్లా దవాఖానలో 10-బెడ్-ఐసీయూ (10BedICU.org) కార్యక్రమాన్ని వర్చువల్ సమావేశం ద్వారా శనివారం ఆయన ప్రారంభించారు. ఏడేండ్ల కేసీఆర్ పాలనలో వైద్యరంగం గణనీయమైన వృద్ధిని నమోదు చేసిందన్నారు. కొవిడ్ కష్టకాలాన్ని ఎదుర్కొనేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడిందని చెప్పారు. 5 మెడికల్ కాలేజీల ఏర్పాటు ద్వారా 1,600 ఐసీయూ పడకలు అందుబాటులోకి తేగా, కొత్తగా మరో 7 మెడికల్ కాలేజీలు త్వరలో సేవలందించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా 600 ఐసీయూ పడకలతో గాంధీ దవాఖాన సేవలందిస్తున్నదన్నారు. ఈ కార్యక్రమం తెలంగాణలోని 33 జిల్లాల్లోని సెకండరీ ప్రభుత్వ దవాఖానల్లో కొనసాగించడంతోపాటు, దేశవ్యాప్తంగా విస్తరించేందుకు తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. కొవిడ్ మూడో వేవ్తోపాటు ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకొంటున్నదని వివరించారు.
దేశవ్యాప్తంగా 100కు పైగా జిల్లా దవాఖానల్లో ఐసీయూ బెడ్ల ఏర్పాటుకు సహకరిస్తానని 10-బెడ్-ఐసీయూ కార్యక్రమానికి మద్దతుగా నిలుస్తున్న వినోద్ కోస్లా ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లోని దవాఖానలకు సాంకేతికత ఎంతో అవసరం ఉందన్నారు. కార్యక్రమం కో ఫౌండర్ శ్రీకాంత్ నాధముణి మాట్లాడుతూ.. దేశంలోని ప్రతి జిల్లాలో ఐసీయూ యూనిట్లు ఏర్పాటు చేయాలన్నది తమ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమం ద్వారా 10-బెడ్-ఐసీయూ ఎక్విప్మెంట్ డొనేట్ చేయడం, కొవిడ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ ప్లాట్ఫాం, ప్రజలకు టెలిమెడిసిన్ సేవలు అందిస్తున్నామని వెల్లడించారు. గ్రామీణ ప్రాంత రోగులకు ఇది ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
10-బెడ్-ఐసీయూ ఒక పీపీపీ ప్రాజెక్ట్. రాష్ట్ర ప్రభుత్వాలతో పలు స్వచ్ఛంద సంస్థలు కలిసి జిల్లా దవాఖానల్లో ఐసీయూ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాయి. తెలంగాణలో తొలిసారిగా నారాయణపేట జిల్లా దవాఖానలో ఐసీయూ యూనిట్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్భగవత్, నారాయణపేట జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి తదితరులు పాల్గొన్నారు.