భువనేశ్వర్ : తాంత్రిక విద్యలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలపై ఓ వ్యక్తిని తీవ్రంగా కొట్టి అతడితో బలవంతంగా మూత్రం తాగించిన ఘటన ఒడిషాలోని బొలన్గిర్ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఉదంతం బయటపడింది. గ్రామంలో ఇటీవల పలువురు అస్వస్థతకు గురికావడంతో మంత్రవిద్యలు నేర్చిన హదిబంధు బగార్తి అనే వ్యక్తే దీనికి కారణమని ఆరోపిస్తూ శనివారం కొందరు గ్రామస్తులు అతడిని ఇంటి నుంచి ఈడ్చుకువచ్చి తీవ్రంగా కొట్టారు.
అతడితో బలవంతంగా మూత్రం తాగించి కర్రలతో దాడి చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు ఆపై అతడిని దవాఖానకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి రెండు కేసులు నమోదు చేసి కొందరు గ్రామస్తులను అదుపులోకి తీసుకున్నామని బొలన్గిర్ పోలీసులు తెలిపారు. కాగా మంత్రవిద్యలు ప్రదర్శిస్తోందనే ఆరోపణలపై 63 ఏండ్ల వితంతువును ఆదివారం మయూర్భంజ్లో కొందరు దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు 14 మందిని అరెస్ట్ చేశారు.