హైదరాబాద్ : జోగులాంబ గద్వాల జిల్లాలో ఐటీ విద్యాసంస్థను నెలకొల్పేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. బాసరలో ఏర్పాటైన రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ తరహాలో గద్వాలలో విద్యాసంస్థను నెలకొల్పనున్నారు. దీనిపై నియామకమైన నలుగురు సభ్యుల కమిటీ ఇప్పటికే పూర్తి స్థాయిలో అధ్యయనం చేసింది. ఇటీవల గద్వాల పట్టణాన్ని సందర్శించిన కమిటీ.. విద్యాసంస్థకు అవసరమైన 70 నుంచి 75 ఎకరాల స్థలాన్ని పరిశీలించింది. ఇప్పటికే గద్వాలలో పాలమూరు యూనివర్సిటీకి సంబంధించిన పీజీ సెంటర్ ఉంది. ఈ మేరకు నలుగురు సభ్యుల కమిటీ రాష్ట్ర ఉన్నత విద్యా మండలితో పాటు ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది.
ఈ విద్యాసంస్థలో బీటెక్ ( ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు ) ప్రవేశపెట్టనున్నారు. పదోతరగతి తర్వాత విద్యార్థులకు ప్రవేశం కల్పించనున్నారు. ఈ సంస్థలో గ్రామీణ విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. బాసరలోని యూనివర్సిటీలో 13 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. బయో సైన్సెస్, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్, హ్యుమనిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, మెటలార్జికల్ అండ్ మెటిరీయల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ కోర్సులతో పాటు ఇతర కోర్సులో అందుబాటులో ఉన్నాయి.