ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి మరింత ఆందోళన రేపుతున్నది. గత కొన్ని రోజులుగా వేలల్లో కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 28.5 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య 3.6 లక్షలు దాటింది. బుధవారం నుంచి గురువారం వరకు కొత్తగా 43,183 కరోనా కేసులు, 249 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 28,56,163కు, మరణాల సంఖ్య 54,898కు చేరింది. అలాగే ముంబైలో గురువారం రికార్డుస్థాయిలో 8,646 కరోనా కేసులు నమోదు కావడంతో మొత్తం సంఖ్య 4,23,360కు పెరిగింది.
మరోవైపు మహారాష్ట్రలో గత 24 గంటల్లో 32,641 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 24,33,368కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,66,533 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్యలో మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది.