చండీఘడ్ : కరోనా వైరస్ సెకండ్ వేవ్ పలువురి ప్రాణాలను హరిస్తూ ఆందోళనకరంగా విస్తరిస్తోంది. మహమ్మారి బారినపడి ప్రజలు మరణిస్తున్న క్రమంలో హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తన వ్యాఖ్యలతో దుమారం రేపారు. కొవిడ్ సంక్షోభంతో చోటుచేసుకుంటున్న మరణాలతో మనం చలించకూడదని, ప్రజలు కోలుకుని మంచి ఆరోగ్యంతో బయటపడటంపై కేంద్రీకరించాలని అన్నారు. మనం ఎంత అరచి మొత్తుకున్నా చనిపోయిన వారు తిరిగిరారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ప్రజలను కాపాడేందుకు అన్ని ప్రత్యామ్నాయాలను తాము ప్రయత్నిస్తున్నామని, రోగులతో సహా తమకు అందరి సహకారం అవసరమని చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి ఆక్సిజన్ కోటాను 240 మెట్రిక్ టన్నులకు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. హిస్సార్, పానిపట్ గ్యాస్ ప్లాంట్ల వద్ద 500 పడకలతో కొవిడ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఇక హర్యానాలో మొత్తం 4,31,981 కొవిడ్-19 కేసులు నమోదవగా, 3842 మంది మరణించారు. హర్యానాలో ప్రస్తుతం 79,466 యాక్టివ్ కేసులున్నాయి.