ములుగు/హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత అజ్మీరా చందూలాల్కు కన్నీటి వీడ్కోలు పలికారు. అనారోగ్యంతో గురువారం రాత్రి కన్నుమూసిన ఆయనకు శుక్రవారం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ములుగు జిల్లా సారంగపల్లిలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన కుమారుడు డాక్టర్ అజ్మీరా ప్రహ్లాద్ తండ్రి చితికి నిప్పంటించారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, శంకర్నాయక్, మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్, కలెక్టర్ కృష్ణ ఆదిత్య తదితరులు చందూలాల్ పార్థివదేహం వద్ద నివాళులర్పించారు. చందూలాల్ మృతిపట్ల శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి సంతాపం తెలిపారు.
చందూలాల్ మృతి పార్టీకి తీరని లోటని మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాజకీయాల్లో అనేక హోదాల్లో సుదీర్ఘకాలంపాటు ప్రజలకు, ముఖ్యంగా గిరిజనుల అభివృద్ధి కోసం సేవలు అందించారని కొనియాడారు. చందూలాల్ ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, గంగుల కమలాకర్ తదితరులు సైతం సంతాపం తెలిపారు. గిరిజనుల సంక్షేమం, వారి అభివృద్ధి కోసం పాటుపడిన మంచి మనిషి చందూలాల్ అని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.